సింగరేణి ఏఎల్పీ ప్రమాద ఉత్కంఠకు తెర
ABN , First Publish Date - 2022-03-10T00:12:19+05:30 IST
సింగరేణి ఏపీఏ డివిజన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం జరిగిన ప్రమాద ఉత్కంఠకు బుధవారం తెరపడింది.
రామగిరి: సింగరేణి ఏపీఏ డివిజన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం జరిగిన ప్రమాద ఉత్కంఠకు బుధవారం తెరపడింది. సైల్, రూఫ్ ఫాల్లో జరిగి బొగ్గు పెళ్లల కింద ఏడుగురు చిక్కుకోగా మంగళవారం వరకు నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురు మృతిచెందారు. బొగ్గులో కూరుకుపోయిన అసిస్టెంట్ మేనేజర్ చైతన్యతేజ, ఏరియా సేఫ్టీ అధికారి జయరాజ్, వీటీసీ ట్రైనర్ శ్రీకాంత్ల మృతదేహాలను బుధవారం అర్ధరాత్రి తర్వాత రెస్క్యూ బృందం వెలికితీసింది. తెల్లవారుజామున ప్రమాద స్థలం నుంచి మ్యాన్ వే వరకు తీసుకవచ్చి అక్కడి నుంచి గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాత్రికి రాత్రే జయరాజ్, చైతన్యతేజ మృతదేహాలను బంధువులకు అప్పగించడంతో స్వస్థలాలకు తరలించారు. ప్రమాద ఘటన తర్వాత ఏఎల్పీ గని ఆవరణ నిర్మానుష్యంగా మారింది.