Vice President elections: ఉపరాష్ట్రపతి ఎన్నికలతో తృణమూల్‌లో చిచ్చు

ABN , First Publish Date - 2022-08-07T22:42:19+05:30 IST

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice President elections)తో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ (TMC)లో చిచ్చు రేగింది.

Vice President elections: ఉపరాష్ట్రపతి ఎన్నికలతో తృణమూల్‌లో చిచ్చు

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice President elections)తో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ (TMC)లో చిచ్చు రేగింది. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినా ఇద్దరు ఎంపీలు ఓటు వేయడంపై ఆ పార్టీ అధిష్టానం కన్నెర్ర చేసింది. పార్టీ ఎంపీలైన శిశిర్ అధికారి (Sisir Adhikari), ఆయన కుమారుడు దిబ్యేందు అధికారి (Dibyendu Adhikari) ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటూ లోక్‌సభలో తృణమూల్ పక్ష నేత సుదీప్ బంధోపాధ్యాయ(Sudip Bandyopadhyay) ఆ ఇద్దరు ఎంపీలకు లేఖలు రాశారు. 






పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగ్‌దీప్ ధనకర్‌ (jagdeep dhankhar)ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డీయే ప్రకటించడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని తృణమూల్ ముందే నిర్ణయించింది. తద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తృణమూల్‌కు పార్లమెంట్‌లో మొత్తం 35 మంది ఎంపీలున్నారు. ఇందులో 23 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


సుదీప్ బంధోపాధ్యాయ రాసిన లేఖలు అందుకున్న శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత సువేందు అధికారి తండ్రి. శిశిర్ అధికారి పశ్చిమబెంగాల్ కాంతి నియోజకవర్గం నుంచి మూడుసార్లు టీఎంసీ ఎంపీగా గెలుపొందారు. ఆయన మరో కుమారుడు దిబ్యేందు అధికారి 2019లో తమ్లుక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. పశ్చిమబెంగాల్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువేందు అధికారి (Suvendu Adhikari) బీజేపీ (Bharatiya Janata Party)లో చేరినా వీరు తృణమూల్‌‌కు రాజీనామా చేయలేదు. టీఎంసీలోనే కొనసాగుతున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి ఓటుహక్కు వినియోగించుకోవడం పార్టీ ఆదేశాలను ధిక్కరించడమేనని తృణమూల్ అధిష్టానం కన్నెర్ర చేసింది. వీరిపై లోక్‌సభ స్పీకర్‌కు ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఆధారాలు కావాలంటూ దాటవేశారని సుదీప్ బంధోపాధ్యాయ ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్ వీరిపై చర్యలు తీసుకోకున్నా పార్టీ తరపున కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ నెల ఆరున జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి జగదీప్‌ ధనకర్ 528 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి, యూపిఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధనకర్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది.

Updated Date - 2022-08-07T22:42:19+05:30 IST