తల్లిని చంపి.. శవం పక్కనే ఆడుకున్న అక్కాచెల్లెళ్లు!

ABN , First Publish Date - 2021-07-23T00:45:20+05:30 IST

హారర్ సినిమా దృశ్యాలను మించిన దారుణమొకటి తమిళనాడులో ఇటీవల చోటుచేసుకుంది.

తల్లిని చంపి.. శవం పక్కనే ఆడుకున్న అక్కాచెల్లెళ్లు!

చెన్నై: హారర్ సినిమా దృశ్యాలను మించిన దారుణమొకటి తమిళనాడులో ఇటీవల చోటుచేసుకుంది. తిరునెల్వెలి జిల్లాకు చెందిన ఉషా అనే మహిళ పళయంకొట్టాయ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆమెకు ఇరవై ఏళ్లు దాటిని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


కాగా.. మంగళవారం నాడు ఆమె ఎంతకీ ఇంటినుంచి బయటకు రాకపోవడంతో  చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. ఇంతలో ఆమె కుమార్తెల్లో ఒకరు బయటకు వచ్చి.. తమ తల్లి చనిపోయిందని చెప్పి మళ్లీ లోపలికెళ్లి తలుపులేసుకుంది.  దీంతో చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిటికీలో నుంచి తొంగి చూడగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యమొకటి వారి కళ్లపడింది. రక్తపుమడుగులో పడిఉన్న తల్లి శవం పక్కనే ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బంతి ఆట ఆడుకుంటూ కనిపించారు.


తల్లి మరణం వారిపై ఎటువంటి ప్రభావం చూపకపోవడం పోలీసులనే నిర్ఘాంతపరిచింది. అక్కాచెల్లెళ్లకు మెల్లగా నచ్చచెప్పి బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తానే ఈ హత్య చేసినట్టు కుమార్తెల్లో ఒకరు అంగీకరించారు. కత్తితో పొడిచి చంపినట్లు ఆమె చెప్పింది. కాగా, అక్కాచెల్లెళ్లకు మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకున్నాకే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-23T00:45:20+05:30 IST