గాజులేసుకుని ఇంట్లో కూర్చోండి!

ABN , First Publish Date - 2020-08-08T08:46:29+05:30 IST

‘వైసీపీ నేతలారా.. రాజధాని అమరావతి అంగుళం కూడా కదలదని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. నమ్మించి ఇప్పుడు మోసం చేశారు. గాజులేసుకుని, చీర

గాజులేసుకుని ఇంట్లో కూర్చోండి!

  • వైసీపీ నేతలపై రైతుల ఆగ్రహం..
  • గాజులు, చీర, పువ్వులతో సారెలు
  • రాజధానిపై రెండు పార్టీలు నాటకం ఆడుతున్నాయని తీవ్ర ఆవేదన
  • 234వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ నేతలారా.. రాజధాని అమరావతి అంగుళం కూడా కదలదని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. నమ్మించి ఇప్పుడు మోసం చేశారు. గాజులేసుకుని, చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని ఇంట్లో కూర్చోండి’’ అని అమరావతి రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక వైసీపీ నాయకుల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ లేదంటూ గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, చీర బహుమతిగా ఇస్తున్నట్లు మందడం ప్రాంతానికి చెంది న మహిళా రైతులు ప్రకటించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా దీక్షా శిబిరంలో సామూహిక వరలక్ష్మీ వత్రం నిర్వహించారు. అమరావతి ద్రోహులైన గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి కోసం చేస్తున్న రైతుల ఉద్యమం శుక్రవారానికి 234వ రోజుకు చేరింది.


దీక్షా శిబిరాల్లో భౌతిక దూరం పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయస్థానాలు తమగోడు ఆలకించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మహిళా రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద నలుపు, ఎరుపు, తెలుపు రంగులో ఉన్న పావురాలను ఎగురవేసి నిరసన తెలిపారు. వెలగపూడిలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. 


రెండు పార్టీల నాటకం 

అమరావతి విషయంలో బీజేపీ, వైసీపీలు కలసి నాటకమాడుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల తీరు అభ్యంతరకరమని అన్నారు. బీజేపీ నేతలు మీడియా ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని, తమకు ఏమాత్రం న్యాయం చేయాలని ఉన్నా మీడియా ముందుకు రావద్దని వెలగపూడి రైతులు విజ్ఞప్తి చేశారు. హోదా నుంచి తప్పించుకోడానికి, అమరావతికి ముడిపెట్టి తమకు ఉరితాళ్లు పేనారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ గృహప్రవేశం నాడు వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని రైతులు కోరారు. కాగా, రాత్రి కొవ్వొత్తులు వెలిగించి ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2020-08-08T08:46:29+05:30 IST