ఆణిముత్యములె తలంబ్రాలుగా... సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2021-04-22T10:32:24+05:30 IST

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి క్షేత్రంలోని నిత్య కల్యాణ మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది.

ఆణిముత్యములె తలంబ్రాలుగా... సీతారాముల కల్యాణం

భద్రాచలం, ఏప్రిల్‌ 21: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి క్షేత్రంలోని నిత్య కల్యాణ మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, యోక్త్రబంధనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, కన్యావరణం, పాదప్రక్షాళన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాఘవుడికి పచ్చలపతకం, సీతమ్మవారికి చింతాకు పతకం, లక్ష్మణస్వామికి శ్రీరామమాడ సమర్పించారు. మహాసంకల్పం పఠించి అభిజిత్‌లగ్నంలో వధూవరుల శిరసుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం మాంగల్యపూజ నిర్వహించి రామదాసు చేయించిన మూడు తాళిబొట్లున్న ప్రత్యేకమైన మంగళసూత్రాన్ని సీతమ్మవారికి ధరింపజేశారు. నూతన వధూవరులకు గోదాదేవి అనుగహ్రించిన నాట్యాతిరుమళి ప్రబంధంలోని వారణమాయరం పాశురాలను పఠనం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సమర్పించారు. వేద ఆశీర్వచనం, అష్టోత్తర హారతితో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ తంతు సుసంపన్నమైంది. కరోనా వ్యాప్తి కారణంగా వేడుకను తిలకించేందుకు భక్తులను అనుమతించకపోవంతో టీవీల్లోనే జనం వీక్షించారు. కాగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండప వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Updated Date - 2021-04-22T10:32:24+05:30 IST