రోడ్లు రక్తసిక్తం
ABN , First Publish Date - 2021-01-25T12:59:11+05:30 IST
రాష్ట్రంలో ఆదివారం రోడ్లు రక్తసిక్తమయ్యాయి. మందంగా కురుస్తున్న మంచు, శృతి మించిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఆరుగురి ప్రాణాలు బలి గొన్నాయి. మరో పదిమందిని ఆస్పత్రి ...
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
పదిమందికి గాయాలు
అతివేగమే కారణం
చెన్నై (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం రోడ్లు రక్తసిక్తమయ్యాయి. మందంగా కురుస్తున్న మంచు, శృతి మించిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఆరుగురి ప్రాణాలు బలి గొన్నాయి. మరో పదిమందిని ఆస్పత్రి పాలు జేశాయి. రామనాథపురం, పుదుకోట జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు ఇందుకు కారణమ య్యాయి. వివరాల్లోకి వెళితే...
రామనాథపురం జిల్లా కీల్కరై ప్రాంతానికి చెందిన ఖాజాసాహుల్హమీద్ (52) విదేశాల్లో ఉద్యోగం చేస్తూ సెలవు నిమిత్తం సొంతూరికి వచ్చాడు. ఆదివారం ఉదయం మదురై నుంచి విమానంలో విదేశాలకు వెళ్లేందుకు తన భార్య రఫీనా (42), కుమార్తె ఫాతిమా, అత్త షాజహాన్ బీబీ (60)లతో కలిసి ఆమ్నీ వ్యాన్లో బయల్దేరారు. వ్యాన్ను బంధువు అహ్మద్ అజాన్ నడిపాడు. వారు పరమకుడి సమీపంలోని చంద్రకుడి వద్ద వస్తుండగా కర్ణాటక నుంచి వస్తున్న టూరిస్ట్ వ్యాన్ వేగంగా ఢీకొంది. రెండు వ్యాన్ల ముందు భాగాలు నుజ్జునుజ్జుకాగా, అహ్మద్అజాన్, ఖాజాసాహుల్హమీద్, షాజహాన్ బీబీలు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పరమకుడి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుదుకోట జిల్లాలో.. : పుదుకోట జిల్లాలో ఆలయ దర్శనం కోసం వ్యానులో బయలుదేరిన ముగ్గురు జాలర్లు ప్రమాదానికి బలయ్యారు. రామనాఽథపురం జిల్లా తంగచ్చిమఠానికి చెందిన జాలర్లు కొందరు ఆలయ దర్శనానికి కారులో బయల్దేరారు. కోటపట్ణణం వద్ద ఆ వ్యానును ఎదురుగా వచ్చిన మరో వ్యాను వేగంగా ఢీకొంది. ఆదివారం వేకువజామున రెండు వ్యాన్లు ఢీకొన్న శబ్దం విన్న స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వాహనాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను వెలికితీయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. కోటపట్టణం పోలీసులు అక్కడకు చేరుకొని కారులో ప్రయాణం చేసిన ఎనిమిది మందిలో ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందినట్టు గుర్తించారు. మిగిలిన ఐదుగురిని మనల్మేల్కుడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మండపం ప్రాంతానికి చెందిన జాలరి ఆరోగ్యం, యేసుపిల్లై, క్లింటస్లుగా పోలీసులు గుర్తించారు.