Tejashwi Yadav: నితీశ్ కుమార్ రాక.. బీజేపీకి చెంపదెబ్బ: తేజస్వీయాదవ్

ABN , First Publish Date - 2022-08-13T01:16:39+05:30 IST

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తిరిగి ‘సోషలిస్టు పార్టీ’లోకి వచ్చారని, బీజేపీకి ఇది చెంపపెట్టు అని బీహార్ నూతన

Tejashwi Yadav: నితీశ్ కుమార్ రాక.. బీజేపీకి చెంపదెబ్బ: తేజస్వీయాదవ్

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తిరిగి ‘సోషలిస్టు పార్టీ’లోకి వచ్చారని, బీజేపీకి ఇది చెంపపెట్టు అని బీహార్ నూతన ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెనకబడిన తరగతులు, దళితుల రాజకీయాలను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందన్న తేజస్వీ యాదవ్.. ప్రాంతీయ పార్టీలను బెదిరించడం, కుదరకుంటే కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నితీశ్ కుమార్‌తో తమకున్న కుటుంబ, సైద్ధాంతిక సంబంధాలను ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ ఉదహరించారు. బీహార్‌లో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒకే వైపున ఉన్నాయన్నారు. నితీశ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, ఇకపై దేశమంతా ఇదే జరుగుతుందని తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు.  


హిందూ-ముస్లిం విభజన వంటి మత రాజకీయాలకు దూరంగా బీజేపీ ఇప్పుడు వాస్తవ సమస్యల గురించి మాట్లాడుతోందన్నారు. వారిప్పుడు అసలైన సమస్యలపై మాట్లాడేలా చేయడంలో తాము విజయం సాధించామన్నారు. తామిచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామన్న ఆయన కొంచెం ఆగాలని సూచించారు. తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్ తన జీవితాంతం మతశక్తులపై పోరాడారని అన్నారు. సామాజిక న్యాయం కోసం, పేదల సంక్షేమం కోసం పోరాడరని గుర్తుచేశారు. అయనెప్పుడూ భయపడలేదని, ఎప్పుడూ వెనకడుగు వేయలేదని అన్నారు.  ఆర్జేడీ కూటమిలోకి తిరిగి రావాలన్న నిర్ణయం ద్వారా నితీశ్ కుమార్ ఆయన భావజాలాన్ని కాపాడుకున్నారని తేజస్వీ యాదవ్ అన్నారు.  

Updated Date - 2022-08-13T01:16:39+05:30 IST