ఆ దుష్ప్రభావాలకు ఇలా దూరం!
ABN , First Publish Date - 2021-07-06T06:13:16+05:30 IST
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత రెండు రోజుల పాటు జ్వరం, ఒళ్లునొప్పులు మొదలైన దుష్ప్రభావాలు తలెత్తడం సహజం.
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత రెండు రోజుల పాటు జ్వరం, ఒళ్లునొప్పులు మొదలైన దుష్ప్రభావాలు తలెత్తడం సహజం. అయితే ఈ ఇబ్బందులను తేలికగా అధిగమించి, పూర్వపు హుషారును కొనసాగించడం కోసం అందుకు తోడ్పడే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి.
పసుపు: యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్... ఇలా పలు సగుణాలు కలిగిన పసుపు వ్యాధినిరోధకశక్తిని కూడా పెంచుతుంది. పసుపులో ఉండే కర్క్యుమనాయిడ్స్, మోనోటెరపీన్స్ అనే ఎసెన్షియల్ ఆయిల్స్ శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకునే ముందు నుంచీ వేయించుకున్న రెండు, మూడు రోజుల వరకూ వంటకాల్లో పసుపు వాడకం పెంచుకోవాలి.
అల్లం: అమీనో యాసిడ్లు, ఎంజైమ్లు పుష్కలంగా కలిగి ఉండే అల్లం ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, ఒత్తిడిని వదిలిస్తుంది. సాయంత్రం వేళ టీలో అల్లం కలిపి తీసుకోవడం ద్వారా వ్యాక్సిన్తో తలెత్తిన ఇబ్బందులను పారదోలవచ్చు.
ఆకుకూరలు: ఆకుకూరల్లో సరిపడా పీచు, విటమిన్ సి, ప్రొవిటమిన్ ఎ కెరోటినాయిడ్లు, ఫోలేట్, మాంగనీసు, మరీ ముఖ్యంగా విటమిన్ కె ఉంటుంది. ఈ పోషకాలతో మెటబాలిజం మెరుగై వ్యాక్సిన్ తదనంతర అలసట మటుమాయం దూరమవుతుంది.
నీళ్లతో కూడిన పళ్లు: వ్యాక్సిన్ తర్వాత శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోవడం అవసరం. ఇందుకోసం నీళ్లతో కూడిన పళ్లను ఎక్కువగా తినాలి. ఈ పళ్ల వల్ల శరీర ఉష్ణోగ్రత సంతులనమై, సరిపడా పోషకాలు అందడం మూలంగా శరీరం పునరుత్తేజం పొందుతుంది. కాబట్టి పుచ్చ, తర్బూజా మొదలైన పళ్లను ఎక్కువగా తీసుకోవాలి.