ప్రజా పంపిణీలో సామాజిక తనిఖీలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-10-08T05:26:22+05:30 IST
ఆహార భద్రతా చట్టం సెక్షన్ 28, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ ఆదేశాలు (జీవోఎంఎస్ నంబరు 25) ప్రకారం ప్రజాపంపిణీ వ్యవస్థలో సామాజిక తనిఖీలు నిర్వహించాలని కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ చేశారు.
విశాఖపట్నం, అక్టోబరు 7: ఆహార భద్రతా చట్టం సెక్షన్ 28, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ ఆదేశాలు (జీవోఎంఎస్ నంబరు 25) ప్రకారం ప్రజాపంపిణీ వ్యవస్థలో సామాజిక తనిఖీలు నిర్వహించాలని కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, సిటిజన్ చార్టర్, వినియోగదారుల హక్కుల గురించి ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలన్నారు. సామాజిక తనిఖీలో భాగంగా రేషన్ సరకులు తీసుకోవడంలో వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆహార భద్రతా చట్టం అమలు, ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారానికి నియమితులైన అధికారుల పేర్లు, హోదా, చిరునామా, ఫోన్ నంబర్లు ఈ-మెయిల్ వివరాలతో బోర్డులను ఎన్జీవో, సర్కిల్ ఆఫీస్, రేషన్ డిపో, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలని కోరారు. రైతుబజార్లలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని జిల్లాల్లో పోషక బియ్యం పంపిణీ చేస్తూ మరికొన్ని జిల్లాల్లో అమలు చేయకపోవడం రేషన్ కార్డుదారుల హక్కులకు భంగం కలిగే విధంగా ఉందని పేర్కొన్నారు.