సోషల్‌ మీడియాలో వైసీపీ కార్యకర్త రోత వ్యవహారం

ABN , First Publish Date - 2022-09-30T05:23:06+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపై సోషల్‌మీడి యాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన ఓ వైసీపీ కార్యకర్తకు తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు దేహశుద్ధి చేశారు.

సోషల్‌ మీడియాలో వైసీపీ కార్యకర్త రోత వ్యవహారం
వైసీపీ కార్యకర్త (సర్కిల్లోని వ్యక్తి)కు దేహశుద్ధి చేస్తున్న దృశ్యం

చంద్రబాబు కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు

గుర్తించిన తెలుగు యువత నాయకులు

ఇదేంటని ప్రశ్నిస్తే దురుసు వ్యాఖ్యలు

దేహశుద్ధి చేసిన వైనం: పారిపోయిన వైసీపీ కార్యకర్త

ఖమ్మం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపై సోషల్‌మీడి యాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన ఓ వైసీపీ కార్యకర్తకు తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. కృష్ణాజిల్లా ఘంటసాల ప్రాంతానికి వైసీపీ కార్యకర్త కోదాటి నర్సింహ.. తన అత్తగారి స్వస్థలమైన ఖమ్మం నగరంలోని టేకులపల్లి కాలనీలో నివాసం ఉంటూ ఆర్‌ఎంపీగా వైద్యం చేస్తూనే తరచూ తన గ్రామానికి వెళుతూ అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం మాజీ సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులపై అసభ్యకరంగా సోషల్‌మీడియాలో ఓ పోస్టింగ్‌ పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు నర్సింహ ఉండేది ఖమ్మంలోనే అని తెలుసుకుని అతడి కోసం రెండురోజులుగా అన్వేషించారు. చివరకు అతడి ఫోన్‌నెంబరును సంపాదించి ఫోన్‌ చేసి.. అలా ఎందుకు పోస్టింగ్‌ పెట్టావని ప్రశ్నించగా.. దురుసుగా మాట్లాడాడు. దీంతో మరింత కోపోద్రిక్తులైన తె లుగు యువత నాయకులు, కార్యకర్తలు గురువారం ఉదయం నర్సింహ ముస్తఫానగర్‌లో ఉన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అతడిని కలిసి పోస్టింగ్‌ పెట్టినందుకు క్షమాపణ చెప్పాలని కోరగా.. అప్పుడు కూడా నర్సింహ అ గౌరవంగా మాట్లాడడంతో టీడీపీ ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి కేతినేని హరీష్‌తో పాటు టీడీపీ, తెలుగుయువత నాయకులు నల్లమల రంజిత్‌, నున్నా నవీన్‌చౌదరి, వక్కంతుల వంశీ తదితరులు అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో నర్సింహ అక్కడినుంచి పరారయ్యాడు. కాగా ఈవిషయంపై ఖమ్మం టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబసభ్యులపై అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టడం బాధాకరమని, క్షమాపణ చెప్పాలని కోరితే మరోసారి తమ అధినేత కుటుంబం, తమ పట్ల అసభ్యంగా మాట్లాడాని వివరించారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఎవరైనా తప్పుడు పోస్టింగ్‌లు పెడితే తెలంగాణ టీడీపీ నాయకులు ఊరుకోరని హెచ్చరించారు. తప్పుడు పోస్టింగ్‌లు పెట్టిన వారిపైనా, అతడిని సమర్థించిన వారిపైనా పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మీడియాతో మాట్లాడిన వారిలో టీడీపీ జిల్లా నాయకులు గుత్తా సీతయ్య, తదితరులున్నారు.


Updated Date - 2022-09-30T05:23:06+05:30 IST