హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఊరట

ABN , First Publish Date - 2021-05-07T06:50:24+05:30 IST

ల్యాండ్‌ అక్విజేషన్‌లో భూములు కోల్పోయిన 25మంది రైతులకు హైకోర్టులో ఊరట లభించింది.

హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఊరట

తిరుపతి(లీగల్‌), మే 6: ల్యాండ్‌ అక్విజేషన్‌లో భూములు కోల్పోయిన 25మంది రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రగిరి మండలం మల్లవరం నుంచి యాదమరి మండలం కుక్కలపల్లె వరకు జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియలో భాగంగా ల్యాండ్‌ అక్విజేషన్‌ అధికారులు రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలుంటే.. 21రోజుల్లోపు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. 25మంది రైతులు తమ అభ్యంతరాలను తెలియజేశారు. అయితే 2018 ఫిబ్రవరి 9న రైతులకు వ్యతిరేకంగా జాయింట్‌ కలెక్టర్‌ ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వులపై (15011-2018 కేసులో 16మంది, 22312-2018కేసులో 9మంది) రైతులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ది యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా, జాయింట్‌ కలెక్టర్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌లను చూపించారు. విచారణ పూర్తయ్యాక భూములు కోల్పోతున్న 25మంది రైతుల వాదనలు ఫిర్యాదులు, అభ్యంతరాలను పునఃపరిశీలించి న్యాయం చేయాలని హైకోర్టు జస్టిస్‌ నైనాల జయసూర్య గురువారం తీర్పును వెలువరించారు. కేసు వేసిన రైతుల్లో.. ఎస్‌.జనార్ధన్‌, నెల్లూరు లక్ష్మీదేవి, పులిపాటి వీరభద్రనాయుడు, డి.కేశవులనాయుడు, నగరం మహేశ్వరి, ఆర్‌.వసంతలక్ష్మి, ఎల్‌.రామచంద్రనాయుడితోపాటు మరో 18మంది ఉన్నారు. 

Updated Date - 2021-05-07T06:50:24+05:30 IST