ఎన్టీఆర్కు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-05-29T07:06:01+05:30 IST
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ ఏడాది ఆయన శత జయంతి కావడం, ఒంగోలు వేదికగా మహానాడు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఈ వేడుకలు నిర్వహించారు. మహానాడు నేపథ్యంలో టీడీపీ అగ్రనేతలు జిల్లాలో ఉండటంతో పలుచోట్ల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహానాడు బహిరంగ సభకు ఆయాప్రాంతాల నుంచి ఒంగోలుకు బయల్దేరిన తెలుగు తమ్ముళ్లు తొలుత తమతమ ప్రాంతాల్లో ఎన్టీఆర్కు నివాళులర్పించి అనంతరం బహిరంగ సభకు వచ్చారు.
ఉత్సాహంగా జయంతి వేడుకలు
ఒంగోలులో నివాళులర్పించిన చంద్రబాబు, అచ్చెన్న
టంగుటూరులో పాల్గొన్న లోకేష్
పలుచోట్ల రాష్ట్ర, జిల్లా నేతల నేతృత్వంలో కేక్ కటింగ్లు
వందలాది గ్రామాల్లో నిర్వహించిన టీడీపీ శ్రేణులు
ఒంగోలు, మే 28 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ ఏడాది ఆయన శత జయంతి కావడం, ఒంగోలు వేదికగా మహానాడు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఈ వేడుకలు నిర్వహించారు. మహానాడు నేపథ్యంలో టీడీపీ అగ్రనేతలు జిల్లాలో ఉండటంతో పలుచోట్ల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహానాడు బహిరంగ సభకు ఆయాప్రాంతాల నుంచి ఒంగోలుకు బయల్దేరిన తెలుగు తమ్ముళ్లు తొలుత తమతమ ప్రాంతాల్లో ఎన్టీఆర్కు నివాళులర్పించి అనంతరం బహిరంగ సభకు వచ్చారు. పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నగరంలోని ఎన్ఎస్పీ అతిథిగృహంలో బసచేసిన చంద్రబాబు అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఏర్పాటు చేసి భారీ బైక్ ర్యాలీతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, ఎంపీ రవీంద్రకుమార్, రాష్ట్రనేతలు చిన్న రాజప్ప, కొల్లు రవీంద్ర, టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులతో కలిసి ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నివాళులర్పించడంతోపాటు భారీ కేక్ను కట్ చేశారు. ఎన్టీఆర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఓటమి అన్నది ఉండదన్నారు. మహానాడుకు వైసీపీ ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులు, రాష్ట్రంలో జగన్రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో ఒంగోలులో టీడీపీ ప్రభుత్వ కాలంలో దామచర్ల జనార్దన్ హయంలో తప్ప వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, ముత్తుముల అశోక్రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావ, టీడీపీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టంగుటూరులో లోకేష్..
టంగుటూరులో శుక్రవారం రాత్రి బస చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం అక్కడి కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొండపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పాల్గొన్నారు. టంగుటూరుతోపాటు సింగరాయకొండ, కొండపి మండలాలకు చెందిన వేలాది మంది తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, సంగం డెయిరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలులో జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, యువనేత విజయ్ పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రమైన ఎర్రగొండపాలెంలో జడ్పీ మాజీ వైస్చైర్మన్ డాక్టర్ రవీంద్ర నేతృత్వంలో వేడుకలు జరగ్గా, కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఈవేడుకల్లో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలతోపాటు వందలాది గ్రామాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని పర్చూరు, అద్దంకి, కందుకూరు, చీరాల నియోజకవర్గాల్లోనూ భారీగానే కార్యక్రమాలను నిర్వహించారు.