కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు
ABN , First Publish Date - 2021-07-27T05:53:13+05:30 IST
అనునిత్యం దేశసరిహద్దులో తమ ప్రాణాలను అడ్డుపెట్టి సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ముష్కరుల దాడిలో మృతి చెందిన అమరవీరులకు బీజేపీ నాయకులు జోహార్లు తెలిపారు.
ఆదిలాబాద్టౌన్, జూలై 26: అనునిత్యం దేశసరిహద్దులో తమ ప్రాణాలను అడ్డుపెట్టి సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ముష్కరుల దాడిలో మృతి చెందిన అమరవీరులకు బీజేపీ నాయకులు జోహార్లు తెలిపారు. సోమవారం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా మున్సిపల్ పార్కులోని కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాయల శంకర్ మాట్లాడుతూ అనునిత్యం తమ ప్రాణాలను అడ్డుపెట్టి విపత్కర పరిస్థితులను కూడా లెక్కచేయకుండా సేవ చేస్తూ సైనికులు దేశప్రజలను కాపాడుతున్నారన్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో అత్యంత కీలకమైన కార్గిల్ సెక్టార్ ప్రాంతంలో సైనికులు కాపల కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నారన్నారు. సార్వభౌమాదికారం కలిగిన ఆ ప్రాంతాన్ని శాంతి ముసుగులో ముష్కరులు చేజిక్కించుకున్నారని దీంతో మన జవాన్లు దాదాపు 3 నెలల పాటు విరోచితంగా పోరాడి శత్రువులను మట్టికర్పించారని గుర్తు చేశారు. ఇందులో 500 మంది సైనికులు వీరమరణం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి ప్రతిఫలమేకార్గిల్ గడ్డ పై మన జాతీయ పతాకం రెపరెపలాడుతుందన్నారు. అలాంటి వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని కోరారు. నాయకులు నాంపెల్లి వేణుగోపాల్, భీంసేన్రెడ్డిపాల్గొన్నారు.
సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో..
సనాతన హిందూ ఉత్సవ సమితి, మాజీ సైనిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్లోని కార్గిల్ పార్కు వద్ద కార్గిల్ విజయ్దివాస్ను జరుపుకున్నారు. కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు నివాళులర్పించారు. ఇందులో ఉత్సవ సమితి సభ్యులు మాదవ్, దేవన్న, కొత్తవార్ రాజేశ్వర్, శ్రీనివాస్, సైనిక సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సుదర్శన్ తదితరులున్నారు.
కార్గిల్ అమరవీరులను మరిచి పోవద్దు..
భారతదేశ సార్వభౌమ ప్రాంతమైన కార్గిల్ను ఆక్రమించే క్రమంలో భారత సైనికులపై ముష్కరులు దాడి చేసిన వారి ప్రాణాలకు తెగించి కార్గిల్ ప్రాంతాన్ని కాపాడిన కార్గిల్ అమరవీరుల సేవలు మరిచి పోవద్దని డీఎస్పీ వెంకటేశ్వర్రావు అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక తరంగిణి ఫంక్షన్ హాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో మాజీ సైనికుల సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ సైనికులు పాల్గొన్నారు.