కేసుల భయంలో కెప్టెన్: పంజాబ్ డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2021-10-20T20:20:44+05:30 IST

కొత్త పార్టీ పెట్టి బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నామంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించడంపై..

కేసుల భయంలో కెప్టెన్: పంజాబ్ డిప్యూటీ సీఎం

చండీగఢ్: కొత్త పార్టీ పెట్టి బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నామంటూ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాండ్వా స్పందించారు. ఆయన నిర్ణయంతో తమకు ఎలాంటి భయం లేదని, కెప్టెన్‌పై కేసుల ఒత్తిడి ఉందని అన్నారు.


''ఆయనపై (కెప్టెన్)చాలా స్పష్టంగా ఒత్తిడి ఉంది. ఆయనపైన, ఆయన పిల్లలపైన చాలా కేసులు ఉన్నాయి. తనను ఎన్నోసార్లు వేధిస్తూ వచ్చిన బీజేపీతో సీట్ల సర్దుబాటు ఉంటుందని ప్రకటించి ఆయన తనను తానే కీడు చేసుకుంటున్నారు. 1984లో రాజీనామా అనంతరం అమరీందర్ సింగ్ ఎక్కడున్నారో, పాక్‌తో ఆయనకున్న సంబంధాలు ఏమిటో బీజేపీ దర్యాప్తు జరిపించాలి''అని రాండ్వా అన్నారు.


దీనికి ముందు, అమరీందర్ సింగ్ సొంత పార్టీ ప్రకటన చేస్తూ, సాగు చట్టాలపై ఆందోళనలు చేస్తున్న రైతుల సమస్యలను పరిష్కరిస్తే 2022లో జరిగే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రమాదంలో పడిన రాష్ట్ర శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం శక్తి మేరకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2021-10-20T20:20:44+05:30 IST