కరోనాతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-11-21T10:16:38+05:30 IST

మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా ఖననం చేసేందుకు జేసీబీని సమకూరుస్తామని చెప్పిన పోలీసులు మూడు గంటలు దాటినా పంపకపోవడంతో

కరోనాతో ఒకరి మృతి

- మృతదేహంతో గ్రామస్థుల ఆందోళన

-  ఖననం చేయడానికి జేసీబీని పంపలేదంటూ అధికారులపై మండిపాటు


వాజేడు, నవంబరు 20 : కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు అధికారులు సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తి (48) కూతురు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ వ్యక్తి మానసిక ఆందోళనకు గురై శారీరకంగా బలహీనపడ్డాడు. పది, పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా  శ్వాసకోశ సమస్యను ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం వెంకటాపురంలో వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వైద్యం కోసం వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.


మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా ఖననం చేసేందుకు జేసీబీని సమకూరుస్తామని చెప్పిన పోలీసులు మూడు గంటలు దాటినా పంపకపోవడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మృతదేహంతో 163వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డుపై టైర్లను దహనం చేసి బైఠాయించారు. మృతుడు దళితుడు కావడం వల్లే అంత్యక్రియలకు జేసీబీని పంపడం లేదని మండిపడ్డారు. ఎస్సై, సర్పంచ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ నిరసనతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న ఎస్సై కొప్పుల తిరుపతిరావు వెంకటాపురం నుంచి జేసీబీని రప్పించడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు శాంతించి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-11-21T10:16:38+05:30 IST