హైదరాబాద్లో పవన్తో సోమువీర్రాజు భేటీ.. అందుకేనా!?
ABN , First Publish Date - 2021-01-24T23:34:10+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కలిశారు.
హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కలిశారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఆయన పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్కు శాలువా కప్పిన వీర్రాజు.. పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులపై ఇరువురూ సుమారు అరగంటకు పైగా చర్చించారు. మరీ ముఖ్యంగా త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికలపై కీలకంగా చర్చించారు. ఎంపీ అభ్యర్ధిని ఎవర్ని బరిలోకి దింపాలనే విషయంపై మాట్లాడారు.
అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు..!
భేటీ అనంతరం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధిపై చర్చించామన్నారు. ‘ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతారు. బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా..? లేకుంటే జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా..? అనేది మాకు ముఖ్యం కాదు. ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశాం. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నాం. ఇరు పార్టీల అధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా ఆలోచన చేశాం. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తాం’ అని వీర్రాజు చెప్పుకొచ్చారు.
పవన్ కీలక వ్యాఖ్యలు..
కాగా.. ఇటీవల తిరుపతిలో పవన్ పర్యటించినప్పుడు బీజేపీతో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ నిబద్ధతతో, కలసికట్టుగా పోటీ చేసిన తీరులోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సివుందని, అప్పుడే తమ కూటమికి విలువ వుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలను బట్టి చూస్తే.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచే వుంటారన్న భావన కలుగుతోందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనసేన పార్టీ నుంచీ ఉమ్మడి అభ్యర్థి వుంటే శ్రేణులు పూర్తిస్థాయిలో ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేస్తాయని, బీజేపీ అభ్యర్థి అయితే మాత్రం ఆ స్థాయిలో శ్రేణులు పనిచేయకపోవచ్చునని ఆ వర్గాలే చెబుతున్నాయి. పవన్ ఇలా వ్యాఖ్యలు చేయడం.. రెండ్రోజుల గ్యాప్లో జనసేనానిని సోమువీర్రాజు కలవడంతో చర్చనీయాంశమైంది.