Mother ను వేధిస్తున్నాడని.. కన్న తండ్రిని చంపిన తనయుడు

ABN , First Publish Date - 2022-05-01T11:53:54+05:30 IST

తల్లిని వేధిస్తుండటంతో కన్న తండ్రి గొంతుకు చైన్‌తో బిగించి చంపేశాడో...

Mother ను వేధిస్తున్నాడని.. కన్న తండ్రిని చంపిన తనయుడు

హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్‌ : తల్లిని వేధిస్తుండటంతో కన్న తండ్రి గొంతుకు చైన్‌తో బిగించి చంపేశాడో కుమారుడు. ఈ సంఘటన శనివారం కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన నారాయణ రావు (54) ఆటో డ్రైవర్‌. కొన్నేళ్ల క్రితం వలసవచ్చి కుల్సుంపురా పరిధిలో స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య చంద్రకళ. ఈమెకు నామ్‌దేవ్‌(33), మహదేవ్‌ (30) కుమారులు. వీరు నవోదయనగర్‌లో ఉంటున్నారు. రెండో భార్య విశ్వకాంత.  ఈమెకు శ్రీకాంత్‌, మరో కుమారుడు ఉన్నారు. వీరు కుల్సుంపురా బస్తీలో ఉంటున్నారు. మొదటి భార్య చంద్రకళకు, నారాయణరావు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భార్యను వేధించడం, కొట్టడం చేస్తుండేవాడు.


ఈనెల 28న రాత్రి నారాయణ్‌ రావు మొదటిభార్య చంద్రకళ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో వారిమధ్య గొడవ జరిగింది. తల్లిని వేధిస్తున్నాడనే కోపంతో నామ్‌దేవ్‌ ద్విచక్ర వాహనం హెల్మెట్‌కు తాళంగా ఉపయోగించే చైన్‌తో నారాయణ్‌ రావు గొంతును బిగించి గట్టిగా లాగాడు. కాలుతో వృషణాలపై తన్నడంతో అతను అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దాంతో కంగారుపడిన నామ్‌దేవ్‌, తమ్ముడు మహదేవ్‌, తల్లి చంద్రకళ సహకారంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో నారాయణ్‌ రావు చనిపోయాడు. దీంతో అన్నదమ్ములు తండ్రి మృతదేహన్ని లంగర్‌హౌస్‌  పరిధిలోని మూసీనదిలో పడేసి ఇంటికి వెళ్లిపోయారు. 


కాగా.. తమ తండ్రి కనిపించడం లేదంటూ రెండో భార్య కుమారుడు శ్రీకాంత్‌ కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు నామ్‌దేవ్‌ మీద అనుమానం ఉందని పోలీసులకు చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. నామ్‌దేవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. శనివారం పోలీసులు మూసీలోని మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-05-01T11:53:54+05:30 IST