సోషల్ మీడియాను నియంత్రించాలంటున్న సోనియా, రాహుల్

ABN , First Publish Date - 2022-03-16T22:27:29+05:30 IST

రాజకీయ అభిప్రాయాలను రూపొందించడం కోసం పార్టీలు

సోషల్ మీడియాను నియంత్రించాలంటున్న సోనియా, రాహుల్

న్యూఢిల్లీ : రాజకీయ అభిప్రాయాలను రూపొందించడం కోసం పార్టీలు, నాయకులు, వారి ప్రతినిధులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటుండటంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలను వీరు వాడుకుంటున్నారని, రాజకీయ వైఖరులను నిర్ణయించేందుకు ఈ సామాజిక మాధ్యమాల వేదికలతో అధికార పక్షం సహవాసం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామిక నిర్మాణానికి ఉపయోగపడబోవని స్పష్టం చేశారు. 


లోక్‌సభలో బుధవారం జీరో అవర్‌లో సోనియా గాంధీ మాట్లాడుతూ, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశ ఎన్నికల రాజకీయాల్లో ఫేస్‌బుక్, తదితర సోషల్ మీడియా జయింట్స్ జోక్యం చేసుకోవడానికి, పద్ధతి ప్రకారం ప్రభావితం చేస్తుండటానికి ముగింపు పలకాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ, దేశ ప్రజాస్వామ్యం, సాంఘిక సామరస్యాలను కాపాడాలని నొక్కివక్కాణించారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు అన్ని పార్టీలకు సమాన అవకాశాలుగల రణక్షేత్రాన్ని అందించడం లేదని తరచూ బహిరంగంగా వెల్లడవుతోందన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే సమాచారం అని తెలిసినప్పటికీ, ఈ కంపెనీలు వాటి నుంచి లాభాలు ఆర్జిస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా విదేశీ మీడియాలో వచ్చిన కథనాలను సోనియా గాంధీ ప్రస్తావించారు. ఫేస్‌బుక్ మిగతా పార్టీల కన్నా బీజేపీకి ఎన్నికల ప్రచార ప్రకటనల రేట్లను తగ్గించిందని విదేశీ మీడియా వెల్లడించిందన్నారు. 


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా బుధవారం ట్విటర్ వేదికగా సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఫేస్‌బుక్ అవాంఛనీయమని పేర్కొన్నారు. ‘‘మెటా - ప్రజాస్వామ్యానికి అవాంఛనీయం’’ అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు బీజేపీ చేరువయ్యేందుకు ఫేస్‌బుక్ సహాయపడినట్లు విదేశీ మీడియా రాసిన కథనాలను ఈ ట్వీట్‌కు జత చేశారు.  ఫేస్‌బుక్ మిగతా పార్టీల కన్నా బీజేపీకి ఎన్నికల ప్రచార ప్రకటనల రేట్లను తగ్గించిందని విదేశీ మీడియా వెల్లడించిందని  తెలిపారు. 


Updated Date - 2022-03-16T22:27:29+05:30 IST