ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు స్పందించిన సోనియాగాంధీ

ABN , First Publish Date - 2021-05-07T20:58:26+05:30 IST

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు

ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు స్పందించిన సోనియాగాంధీ

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు స్పందించారు. ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయని, ఇలాంటి ఫలితాలను ఊహించలేదని అన్నారు. త్వరలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫలితాలపై సమీక్షిస్తామన్నారు.


‘‘దురదృష్టవశాత్తు అన్ని రాష్ట్రాల్లోనూ మా ప్రదర్శన ఏమంత బాగోలేదు. ఇలాంటి ఫలితాలను ఊహించలేదు. త్వరలోనే ఈ ఫలితాలపై సీడబ్ల్యూసీ సమీక్షిస్తుంది’’ అని సోనియా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వర్చువల్ సమావేశంలో సోనియా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌లకు సోనియా శుభాకాంక్షలు తెలిపారు.  


పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలకు పరిమితమైంది. 2016 వరకు అస్సాంపై పట్టు నిలుపుకున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో కొంత పరవాలేదనిపించింది. 95 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 29 స్థానాలతో సరిపెట్టుకోగా, ప్రతిపక్ష కూటమి 50 స్థానాలకే పరిమితమైంది. ఎన్డీయే 75 స్థానాలకు కైవసం చేసుకుంది. 


కేరళలోనూ కాంగ్రెస్‌కు మరోమారు నిరాశే ఎదురైంది. 140 స్థానాలున్న కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ 99 స్థానాలు కైవసం చేసుకుని వరుసగా రెండోసారి అధికారంలోకి రాగా, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ 41 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేకపోయింది.


తమిళనాడులో కాంగ్రెస్ ప్రదర్శన కొంత మెరుగైందనే చెప్పాలి. ఇక్కడ 25 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందింది. అయితే, పాండిచ్చేరిలో మాత్రం అధికారాన్ని నిలబెట్టుకోవడంలో బోల్తా పడింది. గతేడాది అక్టోబరు-నవంబరులో బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పరాజయం ఎదురైంది. అక్కడ 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. 

Updated Date - 2021-05-07T20:58:26+05:30 IST