కొడుకు ఇంజనీర్‌.. తండ్రి బడా చోర్‌

ABN , First Publish Date - 2020-06-07T13:50:14+05:30 IST

కుమారులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి జల్సాల కోసం చోరీల బాటపట్టాడు.

కొడుకు ఇంజనీర్‌.. తండ్రి బడా చోర్‌

  • 22 కేసుల్లో నిందితుడు..  
  • రూ.3.70 లక్షల సొత్తు స్వాధీనం


హైదరాబాద్ : కుమారులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి జల్సాల కోసం చోరీల బాటపట్టాడు. ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనం చేయడంలో ఆరితేరాడు. 22 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని కేపీహెచ్‌బీ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి వెంకట్‌రావు దుండిగల్‌ గండిమైసమ్మ చౌరస్తాలో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి, కుమారులు నిజాంపేటలో ఉంటున్నారు. 


వెంకట్‌రావు కొంతకాలంగా క్లబ్బుల్లో పేకాట ఆడడం, మద్యం తాగుతూ.. జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం దొంగతనాల బాట పట్టాడు. 2009 నుంచి ఇప్పటివరకు నగరంలో 22 ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేశాడు. పలుమార్లు పోలీసులకు పట్టుపడి జైలుకు వెళ్లి వచ్చాడు. గతేడాది అక్టోబర్‌లో  కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీ చేసి జైలుకు వెళ్లి, ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇదే పోలీస్‌స్టేషన్‌‌‌తో పాటు చైతన్యపురి,  ముషీరాబాద్‌ పీఎ్‌సల పరిధిలో మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్‌ బస్టాండ్‌ వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు శుక్రవారం అతడిని పట్టుకున్నారు. విచారించగా, నేరాలను ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3.70లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.

Updated Date - 2020-06-07T13:50:14+05:30 IST