సొంత పార్టీ వారినే వేధిస్తున్నారు

ABN , First Publish Date - 2022-09-24T06:46:33+05:30 IST

పాయరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, నాయకులను, చివరకు కార్యకర్తలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైసీపీ జిల్లా కోశాధికారి, ఎస్‌.రాయవరం-2 ఎంపీటీసీ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు ఆరోపించారు.

సొంత పార్టీ వారినే వేధిస్తున్నారు
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బొలిశెట్టి గోవిందరావు

బదిలీలు, కాంట్రాక్టుల్లో డబ్బులు వసూలు

ఎమ్మెల్యే బాబూరావుపై వైసీపీ నేత బొలిశెట్టి ఆరోపణలు


ఎస్‌.రాయవరం, సెప్టెంబర్‌ 23: పాయరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, నాయకులను, చివరకు కార్యకర్తలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని  వైసీపీ జిల్లా కోశాధికారి, ఎస్‌.రాయవరం-2 ఎంపీటీసీ సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు ఆరోపించారు. శుక్రవారం తన భార్య శారదాకుమారి ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబూరావు గెలుపుకోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి, ఇతర పార్టీల వారికి మేలు చేస్తున్నారని విమర్శించారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన ఎస్‌.రాయవరం మండలంలో ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదని, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారని చెప్పారు. లింగరాజుపాలెం గురుకుల పాఠశాల టీచర్‌ పోస్టులను రూ.2-3 లక్షలకు ఎమ్మెల్యే అమ్ముకున్నారని, ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులను సొంత పార్టీ వారికి ఇవ్వకుండా  వేరే వారికి అమ్మేసుకున్నారని విమర్శించారు. తన భార్యను ఎంపీపీ పదవి నుంచి దించేయడానికి, తమకున్న బీ-సీడీ ధ్రువపత్రాన్ని రద్దు చేయడానికి ప్రత్యర్థులతో కలిసి కోర్టులో కేసులు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరు గురించి గతంలోనే పార్టీ పెద్దలకు చెప్పగా, కొంతకాలం ఓపిక పట్టమని చెప్పారని, అయినా ఈయన తీరు మారకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తన భార్య శారదాకుమారి ఎంపీపీ పదవికి రాజీనామా చేసిందని ఆయన చెప్పారు.


Updated Date - 2022-09-24T06:46:33+05:30 IST