భారత ప్రజాస్వామ్య ఆత్మపై మోదీ, షా దాడి: రాహుల్

ABN , First Publish Date - 2021-07-28T20:57:39+05:30 IST

పెగాసస్ స్పూపింగ్‌పై పార్లమెంటులో చర్చకు అనుమతించకుండా కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని..

భారత ప్రజాస్వామ్య ఆత్మపై మోదీ, షా దాడి: రాహుల్

న్యూఢిల్లీ: పెగాసస్ స్పూపింగ్‌పై పార్లమెంటులో చర్చకు అనుమతించకుండా కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని విపక్షాలు బుధవారంనాడు తప్పుపట్టాయి. భారత ప్రజాస్వామ్యంపై ఆత్మపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలతో ఉదయం సమావేశమైన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. సొంత ప్రజలపైనే నిఘా కోసం ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూపు నుంచి పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారో లేదో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


''మేము కేవలం ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాం. పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందా లేదా? అవునో కాదో చెప్పండి. సొంత ప్రజలపైనై పెగాసిస్ ఆయుధాన్ని ప్రభుత్వం ఉపయోగించిందా లేదా? సభలో పెగాసస్‌పై చర్చ జరిపేది లేదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది''అని  రాహుల్ అన్నారు. ప్రజాస్వామ్యంపై పెగాసస్ ఆయుధాన్ని ప్రయోగించారని, ఇది ఎంతమాత్రం ప్రైవసీకి సంబంధించన విషయం కాదని అన్నారు. ఇది జాతి వ్యతిరేక చర్య అని తప్పుపట్టారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఈ ఆయుధాన్ని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందని తామ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు.


విపక్షాలుగా మా బాధ్యతను మేము చేస్తున్నాం...

ప్రభుత్వం చెబుతున్నట్టు పార్లమెంటు సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడం లేదని, తమ బాధ్యతలను మాత్రమే తాము చేస్తున్నామని రాహుల్ అన్నారు. ఉగ్రవాదులు, జాతీవ్యతిరేకులపై ఉపయోగించాల్సిన ఆయుధాన్ని (పెగాసస్) ఇండియాపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ''ఫోన్లలోకి పెగాసస్ ఆయుధాన్ని మోదీ పంపుతున్నారనే విషయం యువత తెలుసుకోవాలి. ఈ ఆయుధం నామీద, సుప్రీంకోర్టు మీద, ఇతర నేతలు, మీడియా మిత్రులు, యాక్టివిస్టులపై ప్రయోగించారు. ఈ విషయాన్ని సభలో (పార్లమెంటులో) ఎందుకు ప్రశ్నించకూడదు?'' అని రాహుల్ అన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, జాతీయ భద్రత, సాగు చట్టాలపై విపక్ష పార్టీలన్నీ ఐక్యంగానే ఉన్నాయని, ఉంటాయని చెప్పారు.

Updated Date - 2021-07-28T20:57:39+05:30 IST