కిలారిపల్లెలోనూ భూమిలోంచి శబ్దాలు
ABN , First Publish Date - 2021-11-30T07:02:35+05:30 IST
గుడిపాల మండలంలోని కిలారిపల్లె గ్రామంలో భూమిలోంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీశారు.
భయాందోళనల్లో ప్రజలు
గుడిపాల, నవంబరు 29: గుడిపాల మండలంలోని కిలారిపల్లె గ్రామంలో భూమిలోంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 15 సార్లు ఇటువంటి శబ్దాలు వచ్చాయని, భూమి కంపించినట్లు అనిపించిందని చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు గ్రామాన్ని తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, ఎంపీడీవో బాలగణేష్, పంచాయతీరాజ్ ఏఈ జయచంద్రారెడ్డి తదితరులు సందర్శించారు. అధికారులున్నంత సేపు ఎటువంటి శబ్దం రాకపోవడంతో భయపడొద్దని గ్రామస్తులకు ధైర్యం చెప్పి.. వచ్చారు. కాగా.. రామకుప్పం, పలమనేరు, ఐరాల మండలాల్లోనూ ఇటువంటి శబ్దాలు వచ్చాయని ఆయా గ్రామాల వారు భయపడుతున్న విషయం తెలిసిందే.