జొహన్నెస్బర్గ్ టెస్ట్.. దక్షిణాఫ్రికా ఘన విజయం
ABN , First Publish Date - 2022-01-07T03:09:10+05:30 IST
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో
జొహన్నెస్బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జొహన్నెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా మరో రోజు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (91) అద్భుతమైన ఆటకు తోడు డుసెన్ (40) సమయోచితంగా ఆడడంతో భారత్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
ఈ ఉదయం వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. తొలి రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే, ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగా, ఓవర్నైట్ స్కోరు 118/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 175 పరుగుల వద్ద డుసెన్ వికెట్ను కోల్పోయింది. అయితే, అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ ఎల్గర్ అద్భుతంగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఎల్గర్ అజేయంగా 96 పరుగులు చేసి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తెంబా బవుమా 23 పరుగులు (నాటౌట్) చేశాడు. భారత బౌలర్లలో షమీ, శార్దూల్ ఠాకూర్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.
భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులు చేయగా, సఫారీలు 229 పరుగులు చేశారు. ఇండియా తన రెండో ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా నిర్దేశిత 240 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ నెల 11న కేప్టౌన్లో మూడో టెస్టు ప్రారంభమవుతుంది.