మాల్దీవుల్లో దక్షిణ ఆసియా ఫుట్బాల్ సమాఖ్య సమావేశం
ABN , First Publish Date - 2021-10-17T06:19:19+05:30 IST
విశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ల అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న కొసరాజు గోపాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది.
అధికార ప్రతినిధిగా రాష్ట్ర ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు కొసరాజు
విశాఖపట్నం (స్పోర్ట్సు), అక్టోబరు 16: విశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ల అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న కొసరాజు గోపాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సోమవారం నుంచి మాల్దీవులలో జరిగే దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య కాంగ్రెస్ సమావేశానికి భారత ఫుట్బాల్ సమాఖ్య అధికార ప్రతినిధిగా ఆయన హాజరవుతున్నారు.
మాల్దీవులలో జరుగుతున్న దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య చాంపియన్ (ఎస్ఏఎఫ్ఎఫ్) టోర్నీ ఫైనల్ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కీలక సమావేశంలో భారత ఫుట్బాల్ సమాఖ్య అధికార ప్రతినిధిగా పాల్గొంటున్న కొసరాజు గోపాలకృష్ణ ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడి అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య సమావేశంలో భారత ఫుట్బాల్ ప్రతినిధిగా కొసరాజు గోపాలకృష్ణ వరుసగా రెండోసారి ప్రాతినిధ్యం పొల్గొంటుండడంపై జిల్లా, రాష్ట్ర ఫుట్బాల్ సంఘం ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.