ఏ పోలీసు స్టేషన్ మూయలేదు : ఎస్పీ
ABN , First Publish Date - 2020-07-06T10:41:32+05:30 IST
జిల్లాలో ఏ పోలీసు స్టేషన్ మూసివేయలేదని, అన్నింటిలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని..
నెల్లూరు(క్రైం), జూలై 5: జిల్లాలో ఏ పోలీసు స్టేషన్ మూసివేయలేదని, అన్నింటిలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ భాస్కర్ భూషణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెంకటగిరి స్టేషన్ మూసివేశారంటూ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తమని, అటువంటి వార్తలు పంపిన వారు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఇటీవల బాలాయపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును ఛేదించి నిందితులను జైలుకు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఆ నిందితులకు కరోనా పాజిటివ్ రావడంతో వెంకటగిరి సర్కిల్ పోలీసు అధికారులు, సిబ్బంది మొత్తం 61 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఆ పరీక్షల్లో 10 మంది పోలీసులకు మాత్రమే పాజిటివ్ వచ్చిందని, వారికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.