మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-08-07T05:19:08+05:30 IST

మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ స్పష్టం చేశారు.

మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం
గంజాయి బస్తాలను తూకం వేయిస్తున్న గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

మంగళగిరి సిటీ, ఆగస్టు 6: మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ స్పష్టం చేశారు. మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళగిరి టౌన్‌, రూరల్‌, పొన్నూరుకు సంబంధించి గంజాయి కేసులలో పట్టుబడిన గంజాయి నిల్వలను ఆయన పరిశీలించారు. మొత్తం 17 కేసుల్లో సీజ్‌ చేసిన 2,425 కిలోల గంజాయిని పరిశీలించి తూకం వేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ హఫీజ్‌ విలేకరులతో మాట్లాడారు.గంజాయితో దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థులైనా ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. జాతీయ రహదారి ఉండడంతో తాడేపల్లి, మంగళగిరి పట్టణ, రూరల్‌, ప్రత్తిపాడు పోలీసు స్టేషన్ల పరిధిలో గంజాయి కేసులు ఎక్కువగా వున్నాయని తెలిపారు. మంగళగిరి రూరల్‌ స్టేషన్‌ పరిసరాలను, సిబ్బంది పనితీరును, డ్యూటీల నియామకం, రిసెప్షన్‌ నిర్వహణ, లాకప్‌ తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో వున్న కేసులు, రికార్డులను విశ్లేషించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. త్వరలో జరుగనున్న లోక్‌అదాలత్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్‌ డిస్పోజబుల్‌ కమిటీ మెంబర్లు క్రైమ్‌ అడిషనల్‌ ఎస్పీ ఎ.శ్రీనివాసరావు, గుంటూరు సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ మహేష్‌, నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ రాంబాబు, మంగళగిరి పట్టణ సీఐ అంకమ్మరావు, రూరల్‌ సీఐ భూషణం, ఎస్‌బీ సీఐ నరసింహారావు, ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌రెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-07T05:19:08+05:30 IST