పండుగ సీజన్లలో పటిష్ట బందోబస్తు
ABN , First Publish Date - 2020-10-25T09:55:53+05:30 IST
పండుగ సీజన్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్బాబు అన్నారు.
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : పండుగ సీజన్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రవీంద్రనాథ్బాబు అన్నారు. ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యవదినాల్లో ప్రజలు పెద్దఎత్తున ఎక్కడా గుమికూడకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాలకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు.
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో 250 మంది పోలీసులు ఇప్పటివరకూ కరోనా బారిన పడ్డారన్నారు. వారిలో ఆరుగురు మృతి చెందటం దురధృష్టకరమన్నారు. విధులతోపాటు ఆరోగ్యంపై అధికారులు, సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు, సారా తయారీ, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వకుల్జిందల్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ట్రైనీ ఐపీఎస్ ప్రేరణ్కుమార్, ఎస్బీ డీఎస్పీ ధర్మేంద్ర, డీఎస్పీలు మెహబూబ్భాషా, గుడివాడ డీఎస్పీ సత్యానందం, అజీజ్, మురళీకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.