‘స్పందన’కు 249 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-12-07T06:13:02+05:30 IST
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి 249 ఫిర్యాదులు అందాయి.
అర్జీలను స్వీకరించిన కలెక్టర్ వివేక్యాదవ్, జేసీలు
పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు
గుంటూరు(తూర్పు),డిసెంబరు6:ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి 249 ఫిర్యాదులు అందాయి. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 15 ఫిర్యాదులు అందాయి. ఫోను, అర్జీల ద్వారా అందిన ఫిర్యాదులను కలెక్టర్, జేసీలు నేరుగా స్వీకరించి పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులను అదేశించారు.
బయోమెట్రిక్ తప్పనసరి: వివేక్యాదవ్
ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్యాదవ్ మాట్లాడుతూ బయోమెట్రిక్ తప్పనసరిచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వందశాతం అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు తగ్గట్టు ఉపకరణాలను సిద్ధంచేసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే గతంలో స్పందనకు వచ్చి పరిష్కరించినట్టు చూపిన 148 సమస్యలు తిరిగి రీ ఓపెన్ అయ్యాయని, సజావుగా పరిష్కరిస్తే రీ ఓపెన్ ఎలా అవుతాయని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీలు దినేష్కుమార్, శ్రీథర్రెడ్డి, డీఆర్వో కొండయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జీతాలు ఇప్పించండి సారూ..
గత 7నెలులగా గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రత్యేకపోలీసు ఆధికారులు (ఎస్పీవోలు) ఆవేదన వ్యక్తంచేశారు. బకాయిలు ఇప్పించాలంటూ సోమవారం వారు స్పందనలో వినతిపతరం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్రమ మద్యం, అక్రమ ఇసుకను ఆరికట్టేందుకు ప్రభుత్వం ఎస్పీవోలుగా తమను నియమించిందని తెలిపారు. పాదయాత్రలో మాజీ సైనికులను ఆదుకుంటామని జగన్ ఇచ్చిన హమీమేరకు ఉద్యోగాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, తాము కూడా సరిహద్దుల్లో మద్యం, ఇసుక అక్రమాలను ఆరికట్టేందుకు అంతే కృషిచేశామని వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 7 నెలల గౌరవ వేతనం ఇప్పించడంతో పాటు, గుర్తింపుకార్డు, డ్రెస్సు కోడ్ ఇవ్వాలని కోరారు. ఆరోగ్య బీమా, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మాదిరిగా జీతాలు పెంచాలని విజ్ఞప్తిచేశారు.