మాలెగావ్ పేలుళ్ల కేసు.. నిందితులంతా రావాలని ప్రత్యేక కోర్టు ఆదేశం..

ABN , First Publish Date - 2020-12-04T04:34:28+05:30 IST

2008 మాలెగావ్ పేలుళ్ల కేసులోని నిందితులంతా విచారణకు హాజరుకావాలంటూ ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ...

మాలెగావ్ పేలుళ్ల కేసు.. నిందితులంతా రావాలని ప్రత్యేక కోర్టు ఆదేశం..

ముంబై: 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులోని నిందితులంతా విచారణకు హాజరుకావాలంటూ ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19న ఈ కేసు విచారణకు వచ్చిన రోజు నిందితులంతా వ్యక్తిగతంగా ధర్మాసనం ముందుకు రావాలని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా.. అందులో ఇవాళ కేవలం ముగ్గురు మాత్రమే విచారణకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్, సమీర్ కులకర్ని, అజయ్ రోహిర్కార్ తదితరులు ఉన్నారు. వీరి వ్యక్తిగత హాజరును పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... మిగతా నిందితులంతా కోర్టుకు రావాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ ముగ్గురూ కాకుండా ఈ కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాగూర్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది తదితరులు నిందితులుగా ఉన్నారు. ఉపా చట్టంలోని పలు సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2008 సెప్టెంబర్ 29న ఉత్తర మహారాష్ట్రలోని మాలెగావ్‌లో ఓ మసీదు పక్కన మోటార్ సైకిల్ బాంబ్ పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. 

Updated Date - 2020-12-04T04:34:28+05:30 IST