హరిహరులకు విశేష పూజలు
ABN , First Publish Date - 2021-08-03T06:50:28+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరులకు విశేషపూజలు కొనసాగాయి. వైష్ణవ ఆచారపరంగా లక్ష్మీనృసింహుడికి శైవాగమ పద్ధతిలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను కొలిచారు. ఉతవ్సమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు.
యాదాద్రి టౌన్, ఆగస్టు 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరులకు విశేషపూజలు కొనసాగాయి. వైష్ణవ ఆచారపరంగా లక్ష్మీనృసింహుడికి శైవాగమ పద్ధతిలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను కొలిచారు. ఉతవ్సమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. స్వామి అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవలో తీర్చిదిద్ది నిత్యతిరుకల్యాణ వేడుకలు నిర్వహించారు. ముందుగా సుదర్శన హవన పూజలు కొనసాగాయి. కొండపైన అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామిని ఆరాధించిన అర్చకులు దర్శన క్యూకాంప్లెక్స్లో కొలువుదీరిన చరమూర్తులను పంచామృతాలతో మహన్యాసపూర్వక శత రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల సహస్రనామ పఠనాలు, బిల్వపత్రాలతో అర్చించి మహానివేదన చేశారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ స్వయంభువులను కొలుస్తూ నిత్యోత్సవాలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. స్వామికి భక్తులనుంచి వివిధ విభాగాల ద్వారా రూ.7,33,772 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.