హరిహరులకు విశేష పూజలు

ABN , First Publish Date - 2020-09-22T07:16:02+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో హరిహరులకు సో మవారం విశేష పూజలు కొనసాగాయి

హరిహరులకు విశేష పూజలు

యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 21: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో హరిహరులకు సో మవారం విశేష పూజలు కొనసాగాయి. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం నారసింహుడికి, శైవాగమ పద్ధతిలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు నిర్వహించారు. బాలాలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు, హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. రామలింగేశ్వరుడిని ఆస్థానపరంగా ఆరాధించిన పూజారులు ఉపాలయంలో చరమూర్తులకు పంచామృతాభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చించారు. కాగా, స్వామివారికి వివిధ విభాగాల ద్వారా రూ.4,01,592 ఆదాయం సమకూరింది.


కాగా, యాదాద్రి ఆలయ విస్తరణ పనులను వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు సోమవారం పరిశీలించారు. ప్రధానాలయం, తిరువీధుల్లో శిల్ప, సివిల్‌ పనులను పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానాలయం సాలహారాల్లో దేవతా విగ్రహాలను శిల్పులు అమర్చుతున్నారు. నవనారసింహ, దశావతార శ్రీమన్నారాయణ విగ్రహాలతో పాటు 12 మంది ఆళ్వార్ల విగ్రహాలను సాలహారంలో అమర్చుతున్నారు. సుమారు 93 దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. మరో నాలుగైదు విగ్రహాలు అమర్చితే ఈ పనులు పూర్తికానున్నాయి. బ్రహ్మోత్సవ మండపం మెట్ల వద్ద రెయిలింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆలయ సిబ్బందికి కొండకింద తులసికాటేజ్‌లోని దేవస్థాన కార్యాలయం వద్ద రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించారు. 44 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-09-22T07:16:02+05:30 IST