యాదాద్రిలో హరిహరులకు విశేష పూజలు

ABN , First Publish Date - 2021-07-27T06:20:11+05:30 IST

హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శివకేశవులకు సోమవారం విశేష పూజలు చేశారు.

యాదాద్రిలో హరిహరులకు విశేష పూజలు
లక్ష్మీనృసింహుల తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన, జూలై 26: హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో  శివకేశవులకు సోమవారం విశేష పూజలు చేశారు. వైష్ణవ ఆచారపరంగా లక్ష్మీనృసింహుడికి శైవాగమ పద్ధతిలో పరమేశ్వరుడికి నిత్యపూజా కైంకర్యాలు కొనసాగాయి. బాలాలయ కవచమూర్తులను అభిషేకించి అర్చించిన పూజారులు హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. కొండపైన రామలింగేశ్వర స్వామిని ఆస్థానపరంగా ఆరాధించిన అర్చకులు దర్శన క్యూలైన్లలో కొలువైన చరమూర్తులకు వేదమంత్ర పఠనాల నడుమ పంచామృతాభిషేకం నిర్వహించి బిల్వపత్రాలతో అర్చించారు. హరిహరులను దర్శించుకున్న భక్తులు ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.9,32,733 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-27T06:20:11+05:30 IST