గల్ఫ్కు విమాన సర్వీసులు పెంచిన SpiceJet.. మూడు నగరాల నుంచి కొత్త సర్వీసులు
ABN , First Publish Date - 2022-04-19T17:28:22+05:30 IST
భారత్కు చెందిన లోకాస్ట్ క్యారియర్ స్పైస్జెట్ గల్ఫ్కు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది.
ముంబై: భారత్కు చెందిన లోకాస్ట్ క్యారియర్ స్పైస్జెట్ గల్ఫ్కు కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. కరోనా తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రయాణాలు పెరిగి డిమాండ్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుందని ఈ నేపథ్యంలోనే గల్ఫ్కు విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ఈ సందర్భంగా విమానయాన సంస్థ పేర్కొంది. అహ్మదాబాద్, ముంబై, కోజికోడ్ల నుంచి ఈ కొత్త సర్వీసులను నడపునున్నట్లు తెలిపింది. అహ్మదాబాద్ - మస్కట్, ముంబై - రియాధ్, కోజికోడ్ - జెడ్డా మధ్య కొత్త సర్వీసులు నడవనున్నాయి.
ఈ సర్వీసులను ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్లైన్కు చెందిన బోయింగ్ 737, క్యూ400 విమానాలను ఈ రూట్లలో నడపనున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్తో పాటు అంతర్జాతీయ నెట్వర్క్ను బలోపేతం చేసే యోచనలో భాగంగా కొత్త సర్వీసులను తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా స్పైస్జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా వెల్లడించారు.
అలాగే అహ్మదాబాద్-గోవా, అహ్మదాబాద్-బాగ్దొగ్రా, అహ్మదాబాద్-షిర్డీ, ముంబై-తిరుపతి, ముంబై-గౌహతి మధ్య రూట్లలో కొత్త దేశీయ విమానాలను కూడా ఎయిర్లైన్స్ ప్రారంభించనుంది. వీటితో పాటు ఢిల్లీ-జబల్పూర్, ఢిల్లీ-లేహ్, అహ్మదాబాద్-డెహ్రాడూన్, హైదరాబాద్-షిర్డీ, ముంబై-గోవా, ముంబై-శ్రీనగర్ మార్గాల్లో కూడా విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది.