మూగబోయిన ప్రసంగ ఝరి
ABN , First Publish Date - 2021-01-12T06:40:28+05:30 IST
సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ వక్త తుర్లపాటి..
తుర్లపాటి మృతితో చిన్నబోయిన సాంస్కృతిక వేదికలు
పిన్న వయసులోనే కలంపట్టిన నిన్నటి తరం పాత్రికేయుడు
గాంధీ కుటుంబానికి సన్నిహితుడు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఓ ప్రసంగ ఝరి మూగబోయింది. కృష్ణాతీరంలో సాంస్కృతిక వేదికలు చిన్నబోయాయి. అవిశ్రాంత కలం విశ్రాంతి తీసుకుంది. లేఖాస్త్రాలు వెలవెలబోయాయి. కృష్ణాతీరాన జన్మించి, నార్లవారికి ‘అక్షరాలా’ భక్తుడై.. ఏకలవ్య శిష్యుడై పిన్న వయస్సులోనే పత్రికా రచనకు ఉపక్రమించిన ఒక తరం జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు ఇక లేరని తెలిసి, వివిధ రంగాల్లో ఉన్న ఆయన అభిమానులు కంటతడి పెట్టారు. ఆయన లేని వేదికలను ఊహించుకోలేమని వివిధ సాంస్కృతిక సంఘాలవారు నివాళులర్పించారు.
సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ వక్త తుర్లపాటి కుటుంబరావు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు. విజయవాడ శిఖామణి సెంటర్లో నివసిస్తున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి, పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, కళాకారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. కడసారిగా ఆయనకు కన్నీటి నివాళులర్పించారు. తుర్లపాటి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం రామలింగేశ్వర్నగర్ శ్మశానవాటికలో నిర్వహించారు.
వైవిధ్యభరిత ప్రసంగం
తుర్లపాటి ప్రసంగాలు వైవిధ్యభరితంగా సాగుతాయి. వేదికపై తిరుగుతూ ఆయన తన ప్రసంగంతో సభలో ఉత్సాహాన్ని నింపేవారు. ఆయన మాట్లాడిన తర్వాత మిగిలిన వక్తలు మాట్లాడాలంటే కాస్త ఇబ్బంది పడేవారు. రచనలో ప్రత్యేక శైలి ప్రసంగంలో చతురత.. సామాజిక అంశాలపై నిశిత పరిశీలన తుర్లపాటి సొంతం.
ఎవరీ తుర్లపాటి..?
హూ ఈస్ దిస్ తుర్లపాటి..? దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాటి కేంద్ర మంత్రి వి.వి.గిరిని అడిగిన ప్రశ్న ఇది. 1952వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వాటి మూలాలను వివరిస్తూ, రెండు సుదీర్ఘ లేఖలను తుర్లపాటి, ప్రధాని నెహ్రూకు రాశారు. వాటిని చదివిన నెహ్రూ వి.విగిరి ద్వారా తుర్లపాటి గురించి తెలుసుకున్నారు. ఆ లేఖలే గాంధీ కుటుంబంతో తుర్లపాటికి సన్నిహిత సంబంధాలు ఏర్పడడానికి కారణమయ్యాయి. తుర్లపాటి, కృష్ణకుమారిని వివాహం చేసుకున్నప్పుడు నాటి ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ ఆశీర్వచన సందేశాలను పంపారు. తుర్లపాటి కుమారుడు జవహర్లాల్ వివాహానికి రాజీవ్ గాంధీ సందేశాన్ని పంపారు.
జర్నలిజంలో తుర్లపాటి కృషి మరువలేనిది
తుర్లపాటి కుటుంబరావు జర్నలిజానికి ఎనలేని సేవలు చేశారు. నాలుగు వేలకు పైగా జీవితచరిత్రలు రాశారు. 16 వేలకు పైగా ప్రసంగాలు చేశారు. ఆ కృషి ద్వారానే గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు.
- దేవిరెడ్డి శ్రీనాథ్, ప్రెస్ అకాడమీ చైర్మన్