Canada: అంతర్జాలం వేదికగా తెలుగు భాషకి అత్యున్నత వైభవం 'సప్త ఖండ అవధానం'

ABN , First Publish Date - 2022-04-05T17:08:20+05:30 IST

తెలుగు భాషకు చెందిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో మూడు భాషలలో సహస్ర అవధానం చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ "సప్త ఖంఢ అవధాన సాహితీ ఝరి" అనే కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు.

Canada: అంతర్జాలం వేదికగా తెలుగు భాషకి అత్యున్నత వైభవం 'సప్త ఖండ అవధానం'

రికార్డుల వెల్లువ

తెలుగు భాషకు చెందిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో మూడు భాషలలో సహస్ర అవధానం చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ "సప్త ఖంఢ అవధాన సాహితీ ఝరి" అనే కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టారు. ప్రతి మాసం ఒక్కొక్క ఖండం చొప్పున ఇప్పటివరకు దాదాపు 20కి పైగా దేశాలు పాల్గొన్నాయి. ఇక అంతర్జాలం వేదికగా 11 అష్టావధానాలు పూర్తి చేసిన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్.. తాజాగా కెనెడా నుంచి 8 మంది వనితలు పాల్గొన్న 12వ అష్టావధానం పూర్తి చేయడం విశేషం. ఈ అవధానంలో దక్షిణ అమెరికాకు చెందిన పెరూ దేశం నుండి శ్రీనివాస్ పోలవరపు కూడా పాల్గొన్నారు. 


ఈ అవధానంలో శ్రీ కంచి కామకోటి పీఠానికి 70వ పీఠాధిపతులు, జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారు విచ్చేసి తమ అమూల్య అశీర్వాదాలు అనుగ్రహించారు. ఎంతో రసవత్తరంగా, కన్నుల పండువగా సాగిన ఈ అవధానాన్ని సాహితీ ప్రియులు, సాహిత్యాభిమానులూ తిలకించి, ఇటువంటి సభలే తెలుగు భాషను కలకాలం వెలిగింపజేసేవని హర్షం వ్యక్తం చేశారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘శ్రీ ప్రణవ పీఠం’ స్థాపించారు. ప్రవచన కర్తగా వారు సుప్రసిద్ధులు. సంగీత, సాహిత్యాలలో సమప్రతిభ, తెలుగు, సంస్కృతం, హిందీ భాషలలో సమ పాండిత్యం కలిగిన వారు. 


తెలుగు భాషని, సాంస్కృతినీ నిలబెట్టడానికి వీరు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ఏడు ఖండాల్లో జరిగిని ఈ 12 అవధానాలతో కలుపుకుని ఇప్పటికి 1,242 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాతో పాటు తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేశారు. ఈ అసాధారణమైన ప్రతిభని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు గుర్తించాయి.


వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి బింగి నరేంద్ర గౌడ్; జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎం.విజయలక్ష్మి మురుసుపల్లి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుండి చీఫ్ అడ్వైజర్ డా. సాయి శ్రీ, ఏలూరు జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ డా. శివశంకర్ తదితర ప్రతినిధులు నేరుగా శ్రీ ప్రణవపీఠానికి విచ్చేసి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌కు సర్టిఫికెట్, మెడల్ అందజేసి సత్కరించారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సంకల్ప ఝరి ఉవ్వెత్తున సాగాలని, వారి గళం మరిన్ని ప్రణవ నాదాలు పలకాలని, తెలుగు భాష మరింత ఖ్యాతిని గడించాలని ఆశిద్దాం.





Updated Date - 2022-04-05T17:08:20+05:30 IST