తృణమూల్‌లో కలకలం.. మంత్రి ఆరోపణలతో ఇరుకునపడిన మమత..

ABN , First Publish Date - 2022-08-29T02:53:03+05:30 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. సొంత పార్టీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లపై పశ్చిమబెంగాల్ మంత్రి శ్రీకాంత్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు.

తృణమూల్‌లో కలకలం.. మంత్రి ఆరోపణలతో ఇరుకునపడిన మమత..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో కలకలం రేగింది. సొంత పార్టీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లపై పశ్చిమబెంగాల్ మంత్రి శ్రీకాంత మెహతా సంచలన ఆరోపణలు చేశారు. నుష్రత్ జహాన్, మిమి చక్రవర్తి, మలియా, సాయొని ఘోష్, సాయంతికా బెనర్జీ తదితర లీడర్లను దోపిడిదారులుగా అభివర్ణించారు. వారంతా డబ్బు దోచుకుంటున్నారని శ్రీకాంత మెహతా తీవ్ర విమర్శలు చేశారు. ఈ నాయకురాళ్లంతా పార్టీని దోచుకుంటున్నారంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అంతటితో ఆగని ఆయన పార్టీ అధిష్టానానికి చెడ్డవారంతా మంచివారుగా కనపడుతున్నారని, మంచివారిని దగ్గరకే రానీయడం లేదని వాపోయారు. అభిషేక్ బెనర్జీ కూడా తమను అర్థం చేసుకోవడం లేదని  శ్రీకాంత మెహతా చెప్పారు. నుష్రత్ జహాన్, మిమి చక్రవర్తి, మలియా, సాయొని ఘోష్, సాయంతికా బెనర్జీ తదితర లీడర్లను పార్టీ ఆస్తిగా భావిస్తే తనలాంటి వాళ్లు ఇక ఉండాల్సిన అవసరమే లేదన్నారు. తాను మంత్రిగా కొనసాగలేనని, తన దారి తాను చూసుకుంటానని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రజలు తృణమూల్ మంత్రులందరినీ దొంగలని అనుకుంటున్నారని, తాను ఈ దొంగలతో కలిసి ఉండలేనని శ్రీకాంత మెహతా వ్యాఖ్యానించడం ప్రకంపనలు రేపుతోంది. 


మంత్రి పార్థా చటర్జీ (Partha Chatterjee), పార్టీలో బలమైన నేత అనుబ్రత మండల్‌ (Anubrata Mondal) వంటి వారంతా ఇప్పటికే అవినీతి కేసుల్లో జైలుపాలై పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోన్న వేళ శ్రీకాంత మెహతా వ్యాఖ్యలు తృణమూల్‌ కాంగ్రెస్ (Trinamool Congress) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Chief Minister Mamata Banerjee)కి కొత్త తలనొప్పిగా మారాయి. దీంతో శ్రీకాంత మెహతాపై వేటు పడొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


ఎస్ఎస్‌సీ రిక్రూట్ స్కామ్‌ (SSC recruitment scam)లో పార్థా చటర్జీ (Partha Chatterjee) అరెస్ట్ కాగా, పశువుల స్మగ్లింగ్‌ కేసులో అనుబ్రత మండల్‌ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. 

Updated Date - 2022-08-29T02:53:03+05:30 IST