AP News: ‘మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నవారు.. ఎంతమంది మెడలు వంచారు?’
ABN , First Publish Date - 2022-09-29T21:26:17+05:30 IST
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామని సీఎం జగన్ పిట్టకతలు చెబుతున్నారని టీడీపీ నేత ఎద్దేవా చేశారు.
అమరావతి (Amaravathi): వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిస్తామని సీఎం జగన్ (CM Jagan) పిట్టకతలు చెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి (Reddappagari Srinivas Reddy) ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేశాయన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నవారు ఎంతమంది మెడలు వంచారని నిలదీశారు.
కేసులకు భయపడి కేంద్రానికి బేషరతుగా మద్దతిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్కు కాంపౌండ్ వాల్ కట్టిన బిల్లు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులయితే వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయమని చెబుతున్నారని, పోటీ చేయమని ప్రకటించిన ప్రతి ఒక్కరినీ పోటీ చేయాలంటూ సీఎం జగన్ బ్రతిమలాడుతున్నారని అన్నారు. ప్రభుత్వ సలహాదారు ఐ ప్యాక్ టీం చేపట్టిన సర్వేలో వైసీపీకి పది సీట్లు కూడా రావని తేలిందన్నారు. అన్నమయ్య గేటు కొట్టుకుపోతే ఇప్పటివరకు అతీ, గతీ లేదని, పులివెందుల బస్టాండు కట్టించలేని అసమర్థులని, రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.