అభివృద్ధి చేస్తారనే భూములిచ్చాం
ABN , First Publish Date - 2021-04-22T05:39:01+05:30 IST
అభివృద్ధి చేస్తామంటేనే రాజధాని కోసం భూములు ఇచ్చామని అమరావతి రైతులు స్పష్టం చేశారు.
మూడు ముక్కలాటతో నట్టేట ముంచారు
491వ రోజు దీక్షల్లో అమరావతి రైతుల ధ్వజం
తుళ్లూరు, ఏప్రిల్ 21: అభివృద్ధి చేస్తామంటేనే రాజధాని కోసం భూములు ఇచ్చామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారం 491వ రోజుకు చేరుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా రైతు శిబిరాల్లో సీతారాముల కల్యాణం నిర్వహించారు. ‘రావణ రాజ్యం పోవాలి.. రామరాజ్యం రావాలి’ అంటూ నినాదాలు చేశారు. మహిళలు, రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ అమరావతికి భూములు ఇచ్చిన రైతులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం సిగ్గుచేటన్నారు. ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సిన పండుగలు ఈ ప్రభుత్వ దయవల్ల రోడ్ల మీద, రోడ్ల పక్కన ధర్నా శిబిరాల్లో జరుపుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఇన్ని రోజుల నుంచి ధర్నాలు, నిరసనలు చేస్తుంటే రైతుల సమస్యలు ఏమిటని పాలకులు ఇంత వరకు తమ వద్దకు వచ్చి అడిగింది లేదన్నారు. రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందన్నారు. కొవ్వొత్తులతో అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు.
జూమ్ యాప్ ద్వారా 500 రోజుల సభ..
అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుతున్న సందర్భంగా ఈ నెల 30న జూమ్ యాప్ ద్వారా సభ నిర్వహిస్తామని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు. కరోనా లేకపోతే భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్నామని చెప్పారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జూమ్ యాప్ ద్వారా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను వీక్షించడానికి ఎంపిక చేసిన రైతు శిబిరాలలో స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.