ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2020-09-28T17:51:50+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి..
తిరుమల(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. కొవిడ్తో ఉత్సవాలన్నీ ఏకాంతంగా జరిగాయి. చివరి రోజైన ఉదయం 9 నుంచి 10 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని అయిన మహల్ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మహల్ ముందు ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణి(నీటితొట్టె)లో సుదర్శన చక్రాన్ని మునక వేయించడంతో చక్రస్నానం ముగిసింది. అభిషేకం అనంతరం వివిధ పాశురాలను పెద్ద, చిన్నజీయర్ స్వాములు పఠించారు.
ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ధ్వజావరోహణం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య జరిగింది. రోజు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా దేవతలను గరుడాళ్వార్ కోరతాడు. ఆయా కార్యక్రమాల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శేఖర్రెడ్డి, నిశ్చిత, శివకుమార్, అనంత తదితరులు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాలూ ఏకాంతమే?
ఈ ఏడాది అధికమాసం కారణంగా వచ్చే నెల 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వీటి నిర్వాహణపై అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతునే ఉన్న క్రమంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే జరిపించాలనే టీటీడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.