TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-09-25T01:50:35+05:30 IST

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయంలోనే ఏకాంతంగా జరిగిన వాహన సేవలు

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆలయంలోనే ఏకాంతంగా జరిగిన వాహన సేవలు ఈసారి భక్తుల మధ్య జరగనున్నాయి. 2020 మార్చి నెలలో కరోనా వైరస్‌ వ్యాప్తి భారీగా పెరిగిన క్రమంలో టీటీడీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆ ఏడాది మార్చి 21 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు శ్రీవారి దర్శనాలను పూర్తిస్థాయిలో రద్దు చేశారు. ఆ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించినప్పటికీ 2020 సెప్టెంబరు 19 నుంచి 27 వరకు వార్షిక, అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను (అధికమాసం సందర్భంగా) ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 2021లో కూడా కొవిడ్‌ ప్రభావం తగ్గకపోవడంతో అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను మళ్లీ ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో వరుసగా మూడు బ్రహ్మోత్సవాలూ ఆలయానికే పరిమితమయ్యాయి. అయితే ప్రస్తుతం కొవిడ్‌ దాదాపుగా తగ్గిన క్రమంలో ఎట్టకేలకు తిరిగి శ్రీవారు వివిధ వాహనాలపై కొలువుదీరి మాడవీధుల్లో ఉండే భక్తకోటికి దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది. మంగళవారం ధ్వజారోహణంతో ఉత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమవుతాయి. ఏటా కన్యామాసంలో వచ్చే స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రానికి ముగిసేలా ఈ ఉత్సవాలను నిర్వహించడం వైఖాసన ఆగమ సంప్రదాయం. 


తొమ్మిది రోజులపాటు పగలు, రాత్రి వివిధ వాహనాలపై స్వామివారు విహరిస్తూ భక్తకోటిని కటాక్షిస్తారు.రెండేళ్ల తర్వాత వాహనసేవలను వీక్షించే భాగ్యం కలగడంతో ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా వచ్చే అవకాశముంది. పైగా పవిత్రమైన పెరటాశి మాసం కూడా జతకావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. భక్తుల రద్దీని అంచనా వేస్తూ టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో మొదటిరోజు రాత్రి పెద్దశేషవాహనంపై స్వామివారు ఊరేగుతారు. అనంతరం చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. ఐదోరోజు ఉదయం మోహినీ అవతారంలో మురిపించే మలయప్ప రాత్రి గరుడ వాహనంపై భక్తకోటిని అనుగ్రహిస్తారు. ఈసారి గరుడవాహన సేవ పెరటాశి రెండవ శనివారం రావడం గమనార్హం.అనంతరం హనుమంత, స్వర్ణరథం, గజ, సూర్యప్రభ, చంద్రపభ వాహనాలలో వెంకన్న మాడవీధులలో ప్రదక్షిణ చేస్తారు. ఎనిమిదవ రోజు ఉదయం జరిగే మహారథోత్సవాన్ని కూడా భక్తులు విశేషమైనదిగానే భావిస్తారు. ఆ రోజు రాత్రి జరిగే అశ్వవాహనంతో వాహనసేవలు పరిసమాప్తమవుతాయి.తొమ్మిదవరోజు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. 

Updated Date - 2022-09-25T01:50:35+05:30 IST