'NRIsForAmaravati'కి సెయింట్ లూయిస్ ప్రవాసాంధ్రుల భారీ విరాళం
ABN , First Publish Date - 2021-06-16T18:45:34+05:30 IST
అమరావతి రైతులు, మహిళల కష్టాలు చూసి చలించిపోయిన సెయింట్ లూయిస్ ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం అమరావతిపై `మూడు` మార్చుకుని మూడు రాజధానుల తంత్రాన్ని తెరమీదికి తెచ్చింది.
ఆర్థిక సాయం చేసిన ‘సెయింట్ లూయిస్’ తెలుగు వారికి కృతజ్ఞతలు తెలిపిన రాజా సూరపనేని
సెయింట్ లూయిస్: అమరావతి రైతులు, మహిళల కష్టాలు చూసి చలించిపోయిన సెయింట్ లూయిస్ ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం అమరావతిపై 'మూడు' మార్చుకుని మూడు రాజధానుల తంత్రాన్ని తెరమీదికి తెచ్చింది. దీంతో తాము చేసిన భూత్యాగం వృథా అవడమే కాకుండా, ఐదుకోట్ల ఆంధ్రులకు కేరాఫ్ లేకుండా పోతుందనే దూరదృష్టితో రాజధాని రైతన్నలు ఉద్యమ బాట పట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు అన్నదాతలు చేస్తున్న అకుంఠిత ఉద్యమానికి ప్రవాసాంధ్రుల నుంచి ఆపన్న హస్తం అందుతోంది. అన్నదాతల ఉద్యమానికి 'మనం సైతం' అనే నినాదంతో జయరాం కోమటి అమెరికాలోని ప్రవాసాంధ్రుల్లో చైతన్యం రగిలించారు.
అమెరికాలోని సెయింట్ లూయిస్కు చెందిన రాజా సూరపనేని ఇటీవల జరిగిన 'తానా' ఎన్నికలలో ప్రత్యర్థి వర్గం పట్టుబట్టి ఓడించినా, తెలుగు సమాజానికి సేవ చేసే తనలోని అంకిత భావాన్ని మాత్రం ఓడించలేరని నిరూపిస్తూ అమరావతి రైతన్నల ఉద్యమానికి ఆర్థికంగా సాయం చేయాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలో తొలి విడతలో సెయింట్ లూయిస్లోని తెలుగు వారి సహాయంతో 22,200 డాలర్లు(రూ. 16.28లక్షలు) సేకరించి ఈ మొత్తాన్ని `NRIsForAmaravati` కోశాధికారికి చెక్కు రూపంలో అందించారు. అంతేగాక ‘ఒక రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో ఉద్యమిస్తున్న అమరావతి ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన సెయింట్ లూయిస్ ప్రవాసాంధ్రులు.. రైతులకు, మహిళలకు తమ వంతు ఆర్థిక సహాయ, సహకారాలు కొనసాగుతాయని అన్నారు. రజనికాంత్ గంగవరపు, కిషోర్ యార్లగడ్డ, సందీప్ గంగవరపు, కిషోర్ ఎరపోతిన, వంశీ పాతూరి చేసిన కృషిని ప్రవాసాంధ్రులు అభినందించారు. తమకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులకు అమరావతి రాజధాని రైతులు, మహిళలు ధన్యవాదాలు తెలిపారు.