ఆధార్ కార్డు లింకు కోసం పడిగాపులు
ABN , First Publish Date - 2020-12-04T04:58:30+05:30 IST
ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింకు చేసుకోవడం కోసం ఆ గిరిజ నులు ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించారు. కేంద్రం వద్ద ముందురోజు రాత్రి వచ్చి చలిలో పడిగాపులు పడ్డారు.
బొబ్బిలి: ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లింకు చేసుకోవడం కోసం ఆ గిరిజ నులు ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించారు. కేంద్రం వద్ద ముందురోజు రాత్రి వచ్చి చలిలో పడిగాపులు పడ్డారు. సాలూరు మండలం తోణాం పంచాయతీ సిమిడివలసకి చెందిన సుమారు 25 మంది గిరిజనులు బుధవారం రాత్రి బొబ్బిలి పోస్టాఫీసుకు చేరుకున్నారు. రాత్రంతా వృద్ధులు, చంటిపిల్లలతో చలిలో ఇబ్బందులు పడ్డారు. గురువారం వేకువజామునే పోస్టాఫీసు ముందు టోకెన్ల కోసం క్యూలైన్లో నిలుచున్నారు. ఆధార్ కార్డుకు ఫోన్నెంబరును అనుసంధానం చేయ కుంటే ఏ పథకాలు వర్తించవని వలంటీరు చెప్పడంతో తామంతా ఇక్కడకి వచ్చామని వారు తెలిపారు. సాలూరులో ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. సీపీఎం నాయకులు పొట్నూరు శంకరరావు, యుగంధర్ వారికి భోజన ఏర్పాట్లు చేశారు. జ్వరంతో బాధపడుతున్న కొర్ర లక్ష్మి అనే వృద్ధురాలికి మందులు ఇప్పించారు. ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో కూర్మనాథ్కు ఫోన్లో సమాచారం అందించారు. సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందించాలని డిమాండ్ చేశారు.