నిలిచిన పాల సరఫరా
ABN , First Publish Date - 2021-05-07T04:32:19+05:30 IST
చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదు. జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా ప్రతినెల పాలు, బాలామృతం, రాగి పిండి, బెల్లం, గోధుమపిండి, ఎండు ఖర్జూరం తదితర పౌష్టికాహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు.
అదే బాటలో బాలామృతం
(పార్వతీపురం)
చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారం సక్రమంగా అందించడం లేదు. జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా ప్రతినెల పాలు, బాలామృతం, రాగి పిండి, బెల్లం, గోధుమపిండి, ఎండు ఖర్జూరం తదితర పౌష్టికాహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకాలను అమలు చేస్తున్నారు. గర్భిణులకు, బాలింతలకు నెలకు ఐదు లీటర్ల పాలు, చిన్నారులకు 2.5 లీటర్ల పాలు సరఫరా చేయాలి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అమలయ్యే సబ్ప్లాన్ మండలాల్లో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు ఆరు లీటర్ల పాలు ప్రతినెల సరఫరా చేయాల్సి ఉంది. కానీ మార్చి నెలలో అరకొరగా సరఫరా చేయగా.. ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పూర్తిగా నిలిచిపోయింది. కరోనా కష్ట కాలంలో అదనపు పౌష్టికాహారాన్ని సరఫరా చేయాల్సిన సమయంలో సాధారణంగా ఇవ్వాల్సిన పాలు, బాలామృతం విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
కమిషనర్కు తెలియజేశాం
ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పాలు, బాలామృతం జిల్లాకు సరఫరా కాకపోవడం వాస్తవమే. ఈ విషయాన్ని మా శాఖ కమిషనర్కు లేఖ ద్వారా తెలియజేశాం. మిగిలిన పౌష్టికాహార పదార్థాలు క్రమం తప్పకుండా అందిస్తున్నాం.
- ఎం.రాజేశ్వరి, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం