స్టాలిన్ ఆదర్శంగా...!

ABN , First Publish Date - 2021-11-02T07:44:18+05:30 IST

‘మంత్రులు, ఎమ్మెల్యేలు ఇకపై ఇంటినుండే భోజనాలు తెచ్చుకోవాలి’ అన్న తమిళనాడు ముఖ్యమంత్రి సందేశాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, దేశ ప్రధాని అమలు చెయ్యాలి...

స్టాలిన్ ఆదర్శంగా...!

‘మంత్రులు, ఎమ్మెల్యేలు ఇకపై ఇంటినుండే భోజనాలు తెచ్చుకోవాలి’ అన్న తమిళనాడు ముఖ్యమంత్రి సందేశాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, దేశ ప్రధాని అమలు చెయ్యాలి. అసెంబ్లీలోని కాంటీను మూసివేసి, మనమందరం ఇంటి నుండి భోజనాలు తెచ్చుకుందాం అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షల లక్షల జీతాలు వస్తున్నాయి. స్కూలుకి వెళ్ళే పిల్లలు వారివారి భోజనాలు భుజాన తగిలించుకొని తెచ్చుకోవటంలేదూ? అలాగే మన ప్రజాప్రతినిధులు కూడా చట్టసభలకు వస్తూ తమ అన్నం తామే తెచ్చుకుంటే ఆదర్శంగా ఉంటుంది.


కరోనా వలన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తులను అమ్ముకోవటం, లేక అద్దెకు ఇవ్వటం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వారు జీతాలు అలవెన్సులు కూడా తగ్గించుకోవాలి. పెట్రోలు రేటు తగ్గించటం ప్రభుత్వానికి ఎటూ చేతకావటం లేదు కనుక వీరి కార్ల అలవెన్సులు తగ్గిస్తే ఎక్కువ సొమ్ము మిగులుతుంది. ఆదాయం తక్కువగాఉన్న మనలాంటి రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సులు తగ్గిస్తే, సలహాదారుల జీతాలు తగ్గించి, వారి సేవకులను తీసివేస్తే నవరత్నాలకు పనికొస్తుందిగదా! తమిళనాడు ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందరూ ఆయన్ని అనుసరిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు, అలవెన్సులు చాలా ఎక్కువ. అడిగేవారు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటున్నారు. ప్రజల నుంచి గుంజుకుంటున్న పన్నులనే వారు జీతాలుగా తీసుకుంటున్నారు కనుక, ఈ కష్టకాలంలో వారు ఒకసారి పునరాలోచించడం మంచిది. 

నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2021-11-02T07:44:18+05:30 IST