బ్రహ్మాండనాయకికి బ్రహ్మోత్సవం
ABN , First Publish Date - 2021-04-24T05:19:55+05:30 IST
బ్రహ్మాండనాయకికి బ్రహ్మోత్సవం
ఇంద్రకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం
విజయవాడ, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వేదపండితులు, అర్చకులు ఉదయం 9.10 గంటలకు గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు చేయించారు. ఆది దంపతులను వధూవరులుగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్టాపన, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదిదంపతులకు ఈవో భ్రమరాంబ పట్టువస్త్రాలను సమర్పించారు.