రేపు రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

ABN , First Publish Date - 2022-08-10T09:27:19+05:30 IST

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

రేపు రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చ!

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదనపు నిధుల సమీకరణ, పథకాల అమలుకు నిధుల సర్దుబాటు ప్రధానాంశాలుగా ఈ భేటీ జరుగుతుందని భావిస్తున్నారు. అప్పుల్లో కేంద్రం విధించి కోతను ఎలా అధిగమించాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా నిధులను సమీకరించుకోవాలని ఇప్పటికే నిర్ణయించారు. భూముల అమ్మకమే కాకుండా నిధుల సమీకరణకు ఇతరత్రా మార్గాలు ఏమున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి అన్నదానిపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. సీఎం కేసీఆర్‌ కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధుకు కూడా నిధులు కటకటగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాలకు నిధుల సర్దుబాటు అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఒకరోజు ప్రత్యేకంగా శాసనసభా సమావేశం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఎప్పుడు అన్నదానిపై స్పష్టత లేదు. సమావేశం నిర్వహించే తేదీపై ఈ  భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated Date - 2022-08-10T09:27:19+05:30 IST