తెలంగాణపై కేంద్రం వివక్ష.. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ABN , First Publish Date - 2021-02-28T05:07:14+05:30 IST
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, నిధుల కేటాయింపుతోపాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కూడా ఇవ్వడంలేని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు.
రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా గెలుపు ఖాయం
ప్రత్యర్థి ఎవరో విపక్షాలు తేల్చుకోవాలి
రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతిప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, నిధుల కేటాయింపుతోపాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కూడా ఇవ్వడంలేని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. బయ్యారం ఉక్కుపరిశ్రమ విభజనచట్టంలో ఉన్నప్పటికి ఇప్పటివరకు కేంద్రం ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్నా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇక్కడి నేతలు మాటలుచెప్పడం తప్ప కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పనుల గురించి మాట్లాడడంలేదన్నారు. రెచ్చగొట్టే మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ తదితర పథకాలప కేంద్రం ప్రశంసిస్తుంటే ఇక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు కూడా రైతుముఖాముఖి పేరుతో విమర్శిస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని కొందరు కాంగ్రెస్ నాయకులు సవాళ్లు విసురుతున్నారని, కానీ తమ ప్రభుత్వ ఇచ్చిన ఉద్యోగాల గురించి ఎన్నికల ప్రచార సభల్లో చెబుతున్నామని, ప్రజలే తీర్పు చెబుతారిన పేర్కొన్నారు.
ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం కానీవ్వబోం
ఖమ్మం పాతబస్టాండ్ స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వబోమని, దాన్ని ప్రజా అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. మార్చి 1నుంచి బైపాస్రోడ్డులో బస్టాండ్ ప్రారంబించాలనుకున్నా ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రారంభించడంలేదన్నారు. ఎన్నికల్లో ప్రజలచేత తిరస్కారానికి గురైన పార్టీలు తమ పాత విధానాలతో ప్రజలను రెచ్చగొడుతూ పాతబస్టాండ్ను కొనసాగించాలంటూ ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాతబస్టాండ్ స్థలాన్ని లీజులకు ఇచ్చామంటూ తప్పుడుప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఆ స్థలం ఎవరికీ లీజుకు ఇవ్వలేదని మంత్రి స్పష్టంచేశారు. నగరం అభివృద్ధితోపాటు కార్మికలు సౌలభ్యం కోసం బైపాస్లోని కొత్తబస్టాండ్ నుంచి అన్ని బస్సులు రాకపోకలు సాగిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా గెలుపు ఖాయం
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఈ ఎన్నికల్లో పల్లా విజయం ఖాయమని, ప్రత్యర్థి ఎవరో విపక్షాలు తేల్చుకోవాలని సూచించారు. నిధులు, నీళ్లు, నియామకాలు లక్ష్యంగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్థి పథంలో తీసుకెళ్లారన్నారు. కొందరు ఉద్యోగులు, నిరుద్యోగులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని, కానీ విపక్షాల తప్పుడు ప్రచారాలను ప్రజలు మ్మబోరని స్పష్టంచేశారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్రెడ్డి, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్, డీసీసీబీ, డీసీఎంఎస్చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్చార్జిఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.