ఉద్యమకారులారా.. బీజేపీలోకి రండి
ABN , First Publish Date - 2021-12-07T07:49:17+05:30 IST
తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. నిజమైన ఉద్యమకారులకు బీజేపీయే సరైన వేదిక అని స్పష్టం చేశారు.
- స్వరాష్ట్ర సాధకులకు ఇదే సరైన వేదిక..
- పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- ఉద్యమకారులను విస్మరించిన సర్కారు: విఠల్
న్యూఢిల్లీ/వికారాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. నిజమైన ఉద్యమకారులకు బీజేపీయే సరైన వేదిక అని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తదితరుల సమక్షంలో టీఎ్సపీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేస్తున్నారని, ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని, విఠల్ లాంటి చాలా మంది నాయకులు టీఎర్ఎ్సపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విఠల్ అన్నారు.
రాష్ట్రంలో 2 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. ఉద్యోగాల భర్తీపై అనేకసార్లు సీఎం కేసీఆర్కు వివరించే ప్రయత్నం చేశానని, ఏడాది కాలంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. బీజేపీతోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాచరిక పార్టీ నుంచి ప్రజాస్వామిక పార్టీలోకి రావాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఒకవైపు వారసత్వ రాజకీయాలు చేసే పార్టీ ఉందని, మరోవైపు ప్రజాస్వామిక పార్టీ అయిన బీజేపీ ఉందని అన్నారు. ఉద్యమకారులు కలలుగన్న తెలంగాణ రాలేదని, రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ లూఠీ చేశారని తురుణ్చుగ్ ఆరోపించారు.
ఇక దూకుడు..
బీజేపీలో చేరిన టీజేఏసీ మాజీ కో చైర్మన్ విఠల్ రాజకీయంగా ఇకపై దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల సమస్యలు, ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమం చేసిన ఆయన.. బీజేపీ నేతగా ఉద్యోగ నియామకాలు, నీళ్లు, నిధుల అంశాలను ప్రస్తావిస్తూ అధికార పార్టీపై వాగ్బాణాలు సంధించే ఆస్కారం ఉంది. బీజేపీకి మరింత బలం చేకూరుతుందని నేతలు భావిస్తున్నారు.