కేంద్ర చట్టాలను అమలుచేయమని రాష్ట్రాలకు చెప్పలేం
ABN , First Publish Date - 2021-03-06T08:17:39+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అక్షయ గోల్డ్ సంస్థ డిపాజిట్లు సేకరించి తమను మోసం చేసిందని, అక్రమ డిపాజిట్ల సేకరణ నిరోధక
అక్షయగోల్డ్ బాధితుల కేసులో సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అక్షయ గోల్డ్ సంస్థ డిపాజిట్లు సేకరించి తమను మోసం చేసిందని, అక్రమ డిపాజిట్ల సేకరణ నిరోధక చట్టం అమలు చేయించి తమకు న్యాయం చేయాలంటూ తెలంగాణ అక్షయ గోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున వాదనలు విన్న జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్తో కూడిన ధర్మాసనం... అన్ని చట్టాలు అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేమని స్పష్టం చేసింది. చట్టం అమలు కోసం రాష్ట్ర హైకోర్టునే ఆశ్రయించాలని సూచిస్తూ విచారణను ముగించింది. అక్షయ గోల్డ్తో పాటు ఇతర సంస్థలు అక్రమ డిపాజిట్లు సేకరించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల మంది ఇబ్బందిపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన 180 రోజుల్లో బోగస్ కంపెనీల కేసులపై విచారణ ముగించి, బాధితులకు డబ్బు పంచాలని చట్టంలో ఉన్నప్పటికీ మెజారిటీ రాష్ట్రాలు అమలు చేయడంలేదని తెలిపారు.